Tuesday, 3 February 2026

అనుభవజ్ఞుల మార్గమే శరణ్యం

మనిషి జీవన వేగం పెరిగింది. పిల్లల్ని పెంచడం మాట అంటుంచుతే తనని తాను సరిదిద్దుకునే సమయం కూడా ఎవరికీ ఉండటం లేదు. పోనీలే గుర్తు చేద్దాం అనుకున్నా, అసలు చెప్పిన మాట వినటమే మానేశారు. అంతెందుకు .. జెన్ జీ, ఆల్ఫా జీ పిల్లలికి అమ్మమ్మలు తాతయ్యలు అంటే ఎవరో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఋషి సంప్రదాయం, దేశ సంస్కృతి కొత్త తరాలకు అందేది ఎలా?

రామాయణ భాగవతాలు విని పెరిగిన పిల్లలు ఇప్పుడు కోటికి ఒకరిద్దరే ఉన్నారు. పురాణ హీరోల స్థానంలోకి సినిమా హీరోలు, కార్టూన్ హీరోలు వచ్చేసారు. జీవితాన్ని సరిదిద్దుకునే సమయం లేని తల్లిదండ్రుల చేతుల్లో, జీవితం అంటే ఏమిటో తెలియకుండా పిల్లలు పెరుగుతున్నారు. ప్రపంచ పోకడని సాకుగా చూపెట్టి జీవన క్రమశిక్షణని గంగలో కలిపేశారు.

గత మూడు దశాబ్దాలుగా spirituality, yoga, meditation పేరుతో వేద విజ్ఞానం మొత్తం వాణిజ్య వస్తువు అయిపోయింది. అభ్యాసంతో అనుభవాన్ని పొందే ఋషి మార్గం మూతబడింది. పఠనం చేసి ప్రవచనాలు చెప్పటం ప్రబలిపోయింది. అనుభవంతో నేర్పించేవారు లేక ఆచార సాంప్రదాయాలకు బూజు పట్టింది. ఫలితంగా ఆధ్యాత్మ ఆచరణ అటకెక్కింది.

ఆహారం తీసుకుంటేనే ఆకలి తీరుతుంది. అనుభవజ్ఞులను అనుసరిస్తేనే జీవితం ఆనందమయం అవుతుంది. ప్రకృతి నియమాలు, జీవన సూత్రాలు ఎప్పటికీ మారవు. ఇప్పటికైనా మేల్కొని జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకుందాం. ఋషి జీవనాన్ని అలవాటు చేసుకుందాం. జీవన విలువలను నేర్చుకుందాం -  నేర్పిద్దాం. 

Monday, 2 February 2026

"ఆధ్యాత్మ" భాష మారాలి

జెన్ జీ, ఆల్ఫా జీ పిల్లలు పెద్దల మాట వినటం మానేశారు. ఆ పిల్లల ఆలోచనల, ప్రవర్తనల ధోరణికి వారి తల్లిదండ్రులు ఇప్పటికే చేతులెత్తేశారు. అసలు విషయం ఏమిటి అంటే పై రెండు తరాలు సృష్టించుకునే ప్రపంచంలో ఆధ్యాత్మికం అపహాస్యం అవుతోంది. ఈ పరిస్థితి మారకపోతే పెద్దయ్యాక వారు జీవితాన్ని ఎలా నెగ్గుకు వస్తారో అనే భయం కలుగుతోంది. 

మా జీవితానికి మీ అనుభవం ఎందుకు అనేటువంటి విశృంఖలత వారిలో బలపడిపోయింది. ఇది సరైన లక్షణం కాదు.  ఎందుకంటే జీవితాన్ని ఎవరు ఎంత ఆధునికం చేసుకున్నా, జీవన నియమాలు మాత్రం ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా మారవు. శాశ్వతమైన అలాంటి జీవన నియమాలను ఆచరణాత్మకంగా సొంతం చేసుకునే విధానానికే "ఆధ్యాత్మికం" అని పేరు.

ఇప్పుడు కాదు 2050 లో పుట్టిన పిల్లలైనా సరే భగవంతుడిని కళ్ళతో చూడలేరు, ఆనందాన్ని అంగట్లో కొనుక్కోలేరు. అది సృష్టి నియమం. అంతే. ఏ మనిషైనా సరే, ఎప్పుడు పుట్టిన సరే ఆనందం యొక్క అనుభూతి లేకుండా, భగవంతుని యొక్క అనుభవం లేకుండా ప్రశాంత జీవనాన్ని సాగించలేడు. ఇది సత్యం.

అందుకే కొత్త తరం పిల్లల పోకడ చూస్తుంటే భయం వేస్తోంది. వారిలో "ఆధ్యాత్మ" బీజాలు నాటటానికి వారి తల్లిదండ్రుల వల్ల కూడా కావడం లేదు. ఈ నేపథ్యంలో పాత తరాలు కొత్త ఆధ్యాత్మ శైలిని సిద్ధం చేసి తీరాలి. కొత్త తరాల భావాలను ఆకర్షించే విధంగా "ఆధ్యాత్మ" భాషను కూడా సరిదిద్దుకోవాలి.

Sunday, 1 February 2026

ప్రమాదంలో Gen Z

పూర్వకాలం మనిషి తన జీవన పరిణామ క్రమంలో పూర్ణ అనుభవాన్ని పొందాడు. అలాంటి అనుభవజ్ఞులను అనుసరించి మరికొందరు పూర్ణులయ్యారు. ఇది తొలిదశ అనే ప్రాచీన కాలం.

కాలక్రమంలో కొందరు మహానుభావులు ఆ అనుభవ సారాన్ని అక్షర స్వరాల్లో పొందుపరిచారు. అలా పొందుపరిచిన సంకలనమే ..  అనేకమంది అనుభవజ్ఞుల జీవన సారమైన .. "వేదం". ఇది మలిదశ అని చెప్పుకోవాల్సిన వేద కాలం. 

తొలి దశలో ఉన్నవారు ప్రాచీన ఋషులు,
మలిదశలో ఉన్నవారు వేద ఋషులు. 
ఈ ఇద్దరి సమగ్ర అనుభవమే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, దర్శనాలు ఇత్యాది గ్రంథాలు. ఈ సమస్త వాఙ్గమయానికి సాక్షి వేద వ్యాసుడు.

ద్వాపర యుగం వరకు ఉన్న వ్యాసునికి కలియుగంలో  ఉత్తరాధికారి ఆది శంకరులు. ఆయన జగద్గురువుగా వేద వాంగ్మయమే పునాదిగా చేసిన ప్రబోధం గత పాతికేళ్లలో మొద్దుబారింది. ఈ కాలంలోనే మత గ్రంథాలపై తర్కం పెరిగి, ఆధ్యాత్మ ఆచరణపై పట్టు తగ్గింది.

దీంతో జెన్ జీ యువత మత గ్రంథాలపై విముఖత పెంచుకుంది. జీవన నియమాలను వివరించే ఆధ్యాత్మికతను మత కార్యక్రమాలు గా భావించి కొట్టి పారేస్తోంది. ఈ నేపథ్యంలో  గ్రంథాలు అంటే "అనుభవం" పొందే మార్గాలు  అని చెప్తూ ఆధ్యాత్మ ఆచరణ వైపు నేటి తరాన్ని నడిపించాలి.