Sunday, 8 March 2026

ఉనికి సత్యం జీవుడు

ఉనికి ఉన్నంతసేపూ సత్యం తెలియదు.

ఉనికిని కోల్పోయి .. జీవుడు ఉండలేడు.


మరి ఉనికీ లేక .. జీవుడూ లేక ..

సత్యాన్ని తెలుసుకునేది ఎవరు,

తెలియబడేది దేనికి?


ఇంతకూ ఉనికి అంటే ఏమిటి .. ఏది?

మనకు తెలుస్తున్న ఉనికేనా ..

సత్యాన్ని తెలుసుకునేది ఇంకేదైనా ఉందా?


ఏదిఏమైనా  తెలుస్తున్న ఉనికికి

సత్యం తెలిసే అవకాశమే లేదు.

ఇంకేదైనా ఉందో లేదో మనకి తెలియదు.


సత్యం అనేది కచ్చితంగా తెలుస్తుందని,

"తెలుస్తున్న" ఉనికి సత్యాన్ని గ్రహించలేదని,

రూఢి అయిన ఈ నేపథ్యంలో ...

మనకి తెలిసిన ఉనికి .. మిథ్య అని తేలినట్టే.


మరి సత్యం తెలిసేది ఎవరికి?

ఉనికికే. కానీ మిథ్యా ఉనికికి మాత్రం కాదు.

సత్యమైన ఉనికికి మాత్రమే.


అంటే సత్యమే అనంతమైన ఉనికి.

జీవుడి నిజమైన ఉనికే .. సత్యం.

Saturday, 28 February 2026

వయసు ప్రకారం 'బాధ్యత'

బాల్యప్రాయం ఏడేళ్ల వరకు ఆటపాటలతో ఉత్సాహంగా ఉండే పిల్లలకు తల్లిదండ్రులే మంచి అలవాట్లు చేయాలి.

తర్వాత కిశోరప్రాయం 14 ఏళ్ల వరకు సొంత భావాలు ఏర్పడే పిల్లల్లో చిన్నప్పటి మంచి అలవాట్లు నిలబడి పోయేలా తల్లిదండ్రులే కృషి చేయాలి.

కౌమారప్రాయం 21 ఏళ్ల వరకు స్వతంత్ర ప్రవృత్తి ఏర్పడే పిల్లల్లో అవే మంచి అలవాట్లు దృఢపడిపోయేలా తల్లిదండ్రులే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

యవ్వనం మొదటి దశలో 41 ఏళ్ల వరకు చిన్నప్పటి మంచి అలవాట్లతో పాటు జీవితానికి అవసరమైన సద్గుణాలను వ్యక్తి స్వయంగా అభ్యాసం చేసి అలవర్చుకోవాలి.

యవ్వనం రెండో దశ 61 ఏళ్ల వరకు అనుభవంతో జీవనాన్ని ప్రశాంతంగా సాగించే అవగాహనను పెంచుకోవాలి.

వార్ధక్య దశ 82 ఏళ్ల వరకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆనందంగా అనుభవిస్తూ శరణాగతి భావనలో కాలాన్ని గడపాలి.

Saturday, 7 February 2026

కర్మ గురించి టూకీగా ..

ప్రతి మనిషి ఆడగానీ మగ గానీ తను ఏ తల్లిదండ్రులకి పుట్టాలి అనేది ముందుగానే నిర్ణయించుకుంటాడు. తల్లి గర్భంలోకి చేరే ముందు జన్మకి కారణమైన కర్మ మొత్తం సాలిడ్ గా ఒక మూటలా ఉంటుంది. కర్మ అంటే ఇంతకుముందు చేసిన పనులకు ప్రతిఫలం అనుభవించడం. అంటే ఒకరకంగా అప్పు తీర్చడం లాంటిది.

పుట్టటానికి ముందు ఉన్న ఆ కర్మ మూటని 100 రూపాయల అప్పు అనుకుందాం. అందులో కాలం ఆ మనిషికి ఆ జన్మలో 40 రూపాయల అప్పు తీర్చుకునే అవకాశం కల్పిస్తుంది అనుకుందాం. అందుకు అనుగుణంగా మనిషి తన తల్లిదండ్రులను ఎంచుకుని జన్మిస్తాడు. అలా ఆ జన్మలో తీర్చుకునే 40 రూపాయల అప్పును ప్రారబ్ద కర్మ అంటారు. మిగిలి ఉన్న 60 రూపాయల అప్పును సంచిత కర్మ అంటారు.

ఈ జన్మలో 40 రూపాయల అప్పును తీర్చుకోవటానికి పుట్టిన ఆ వ్యక్తి ఆ అప్పు తీర్చుకుంటూ.. పరిస్థితుల ప్రభావానికి లోబడి శారీరక నియంత్రణ మానసిక నియమం కోల్పోయి పాపకర్మలు చేస్తే .. కొత్త అప్పు తయారవుతుంది. ఆ కొత్త అప్పునే ఆగామి కర్మ అంటారు. అది ఓ 40 రూపాయలు  తయారయింది అనుకుందాం. అది వచ్చే జన్మలో సంచిత కర్మ 60 రూపాయలతో కలిసి మళ్లీ 100 రూపాయల కర్మమూటగా తయారవుతుంది. అంటే ఈ జన్మ 40 రూపాయల కర్మను తీర్చుకోవడంలో విఫలమైంది అని అర్థం.

అలా కొత్త అప్పు ఏర్పడకుండా పాత అప్పులు సజావుగా తీర్చుకోగలగాలి అంటే ఒక సూత్రం ఉంది. కొత్త అప్పులు పుట్టటానికి కారణమైన ఇంద్రియ వేగాలు శారీరక విశృంఖలతను నియంత్రించగల సత్కర్మలు చేయాలి. సత్కర్మలు చేస్తూ జీవించటం వల్ల కొత్త అప్పులు పుట్టవు. అలా కొత్త అప్పులు పుట్టకుండా జీవించటాన్ని ధర్మ జీవనం అంటారు.

అలా ధర్మ జీవనం సాగిస్తూ అదనంగా ఆధ్యాత్మిక సాధన గనక చేస్తే సంచిత కర్మగా ఉన్న 60 రూపాయల్లో కూడా కొంత అప్పు ఆ సాధన మేరకు తగ్గుతూ ఉంటుంది. అలా జన్మకు కారణమైన సంచిత - ప్రారబ్ధ - ఆగామి కర్మలను అదుపులో వుంచ గల సత్కర్మలను, ఆధ్యాత్మిక సాధనలను తెలుసుకొని చేస్తూ ఉంటే జన్మ అనేది కర్మ నుంచి విడిపోయి ముక్తి కలుగుతుంది.

Friday, 6 February 2026

పిల్లలపై 'ఆహారం' ప్రభావం

తిండి బలం వల్ల శారీరక ఆరోగ్యం, శబ్ద బలం వల్ల మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. ఇది సూత్రం. శాంత స్వభావంతో కూడిన సత్ప్రవర్తన పిల్లలకు అలవాటు అవాలి అంటే వాళ్ళకి శారీరక, మానసిక దృఢత్వం ఉండాలి. అందుకోసం ముందుగా పిల్లలకు ఉత్తమమైన ఆహారపు అలవాట్లు చేయాలి. ఇంటిల్లపాదికీ క్రమశిక్షణతో కూడిన భోజనపు అలవాట్లు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. శారీరక మానసిక ఆరోగ్యం పై ఆహారం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

ఆహారం వల్ల శరీరానికి అవసరమైన శక్తి పుడుతుంది. ఆ శక్తి ఆహారానికి ఉన్న గుణం వల్ల ప్రభావితం అవుతుంది. ఈ గుణాలే ఇంద్రియాల పనితీరును నిర్ణయిస్తాయి. తమోగుణ ప్రధానంగా ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తే నిద్ర బద్ధకం అలసత్వం అలవాటు అవుతాయి. రజోగుణ ప్రధానమైన ఆహారాన్ని స్వీకరిస్తే కోపం, పోటీ తత్వం, అసహనం అలవాటు అవుతాయి. సత్వగుణ ప్రధానమైన ఆహారం వల్ల పిల్లల్లో శాంతం, మాట వినేతనం, పక్కవారితో పంచుకునేతనం అలవాటు అవుతాయి.

ఆహారం వల్లనే మనసు కూడా ఏర్పడుతుంది. అంటే ఆహారంలో ఉన్న స్వభావమే మనసు స్వభావం అవుతుంది. భోజన అలవాటు క్రమశిక్షణతో లేకపోతే మనసు విచక్షణను కోల్పోతుంది. ఆహారంలో పులుపులు, కారాలు ఎక్కువగా ఉంటే దానివల్ల తయారైన మనసు కూడా రజోగుణంతో ఉద్రేకంగా ఉంటుంది. సత్వగుణం ప్రధానంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనసు కూడా సత్వగుణంతో శాంతంగా ఉంటుంది.

అందుకే ఆహారాన్ని పరిమాణంలోనూ ప్రమాణంలోనూ ఉత్తమంగా ఉండేలా చూసుకుని తినాలి. కాల నియమాన్ని కచ్చితంగా పాటించాలి. ఆయా పదార్థాలకు ఉన్న గుణాల ప్రభావం ఏంటో తెలుసుకుని ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆహారాన్ని భుజించేటప్పుడు ఆలోచనలు దైవికంగా ఉంటే సత్ఫలితాలు వస్తాయి. మన పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగాలి అనుకునే వారి కోసం ఇది.

Thursday, 5 February 2026

ప్రపంచం - అహం - ప్రశాంతత

అన్నిటికీ "నేను" ఆధారం. నేను అంటే అహం. నేను అంటే గుర్తు. నేను అనుకోకుండా ఏ మనిషి ఉండలేడు. నేను కి పునాది ఆలోచనలు అభిప్రాయాలు. వాటికి పునాది, మనిషి చుట్టూ జరిగే సన్నివేశాలు సంఘటనలు. అవి ఏర్పడే వేదికనే "ప్రపంచం" అంటారు.

ఈ విధంగా ప్రపంచం "నేను"ను ఆక్రమించి ఉంటుంది. ప్రపంచం ఆక్రమించి ఉన్న నేను నే అహం అంటారు. ఈ అహం వల్లనే మనిషికి సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. సంఘర్షణలేని ప్రశాంతత కావాలి అంటే అహం కరిగిపోవాలి. అంటే ప్రపంచం కల్పించే సన్నివేశాలు సంఘటనలు వల్ల ఏర్పడే ఆలోచనలు అభిప్రాయాలు మనిషి పై ప్రభావం చూపకూడదు.

ప్రపంచం అనే "మూడు అంశాల" ద్వారా అహాన్ని రెచ్చగొట్టే "రెండు పరిణామాలు" ఏర్పడటానికి మూల కారణం ఇష్టా ఇష్టాలు. ఇలా ఒకదాని వల్ల మరొకటి జరగటాన్ని అంటే "పరిణామాల క్రియాశీలత"ను దృష్టిలో ఉంచుకునే నేను నాది అనే భావనల నుంచి దూరం అవ్వాలి, అప్పుడే ప్రశాంతత ఏర్పడుతుంది.

కాలం మారుతూ ఉంటుంది. అంటే కాల లక్షణం మారుతూ ఉంటుంది అని అర్థం. అందుకే కాలానికి అనుగుణంగా అవగాహన మారుతుంది. అవగాహనకి అనుగుణంగా నిర్వచనాలు మారుతూ ఉంటాయి. కానీ సృష్టికి సంబంధించిన పరిణామాల విధానం ఎప్పటికీ మారదు.

Wednesday, 4 February 2026

మూడు - రెండు. That's all.

ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో ఎదురుపడేవి మూడే మూడు అంశాలు. ఒకటి వ్యక్తి, రెండు వస్తువు, మూడు విషయం. ఈ మూడు అంశాలతోటి లేదా ఏదైనా ఒక అంశం తోటి మనిషి వ్యవహరించినప్పుడు జరిగే పరిణామాలు రెండే రెండు. ఒకటి సన్నివేశం రెండు సంఘటన. 

కేవలం మూడు అంశాల కారణంగా సంభవించిన రెండే రెండు పరిణామాల ప్రభావం వల్ల మనిషిలో వందల కొద్దీ ఆలోచనలు, వేలాది అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటికి అనుగుణంగానే మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు.

ఏ మనిషికైనా ప్రాపంచిక జీవితం అంటే ఇదే .. ఇంతే. ఇంకేమీ ఉండదు. ఏ మనిషి తన జీవిత కథ చెప్పుకున్నా సన్నివేశాలు - సంఘటనలు, వాటిపై తనకి కలిగిన ఆలోచనలు - అభిప్రాయాలు తప్ప ఇతర వివరాలు ఉండే అవకాశమే లేదు . 

పైగా అవన్నీ పైన చెప్పుకున్న  వ్యక్తులు వస్తువులు విషయాలతోటి మాత్రమే ముడిపడి ఉంటాయి తప్ప మరొకదానితో సంబంధమే ఉండదు. అందుకే ఏ మనిషి జీవితాన్ని స్కానింగ్ చేసిన ఇదే బ్లూ ప్రింట్ ఉంటుంది. మనుషుల భౌతిక జీవితం మొత్తం పరిధి ఇంతే.

Tuesday, 3 February 2026

అనుభవజ్ఞుల మార్గమే శరణ్యం

మనిషి జీవన వేగం పెరిగింది. పిల్లల్ని పెంచడం మాట అంటుంచుతే తనని తాను సరిదిద్దుకునే సమయం కూడా ఎవరికీ ఉండటం లేదు. పోనీలే గుర్తు చేద్దాం అనుకున్నా, అసలు చెప్పిన మాట వినటమే మానేశారు. అంతెందుకు .. జెన్ జీ, ఆల్ఫా జీ పిల్లలికి అమ్మమ్మలు తాతయ్యలు అంటే ఎవరో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఋషి సంప్రదాయం, దేశ సంస్కృతి కొత్త తరాలకు అందేది ఎలా?

రామాయణ భాగవతాలు విని పెరిగిన పిల్లలు ఇప్పుడు కోటికి ఒకరిద్దరే ఉన్నారు. పురాణ హీరోల స్థానంలోకి సినిమా హీరోలు, కార్టూన్ హీరోలు వచ్చేసారు. జీవితాన్ని సరిదిద్దుకునే సమయం లేని తల్లిదండ్రుల చేతుల్లో, జీవితం అంటే ఏమిటో తెలియకుండా పిల్లలు పెరుగుతున్నారు. ప్రపంచ పోకడని సాకుగా చూపెట్టి జీవన క్రమశిక్షణని గంగలో కలిపేశారు.

గత మూడు దశాబ్దాలుగా spirituality, yoga, meditation పేరుతో వేద విజ్ఞానం మొత్తం వాణిజ్య వస్తువు అయిపోయింది. అభ్యాసంతో అనుభవాన్ని పొందే ఋషి మార్గం మూతబడింది. పఠనం చేసి ప్రవచనాలు చెప్పటం ప్రబలిపోయింది. అనుభవంతో నేర్పించేవారు లేక ఆచార సాంప్రదాయాలకు బూజు పట్టింది. ఫలితంగా ఆధ్యాత్మ ఆచరణ అటకెక్కింది.

ఆహారం తీసుకుంటేనే ఆకలి తీరుతుంది. అనుభవజ్ఞులను అనుసరిస్తేనే జీవితం ఆనందమయం అవుతుంది. ప్రకృతి నియమాలు, జీవన సూత్రాలు ఎప్పటికీ మారవు. ఇప్పటికైనా మేల్కొని జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకుందాం. ఋషి జీవనాన్ని అలవాటు చేసుకుందాం. జీవన విలువలను నేర్చుకుందాం -  నేర్పిద్దాం.