Friday, 6 February 2026

పిల్లలపై 'ఆహారం' ప్రభావం

తిండి బలం వల్ల శారీరక ఆరోగ్యం, శబ్ద బలం వల్ల మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. ఇది సూత్రం. శాంత స్వభావంతో కూడిన సత్ప్రవర్తన పిల్లలకు అలవాటు అవాలి అంటే వాళ్ళకి శారీరక, మానసిక దృఢత్వం ఉండాలి. అందుకోసం ముందుగా పిల్లలకు ఉత్తమమైన ఆహారపు అలవాట్లు చేయాలి. ఇంటిల్లపాదికీ క్రమశిక్షణతో కూడిన భోజనపు అలవాట్లు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. శారీరక మానసిక ఆరోగ్యం పై ఆహారం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

ఆహారం వల్ల శరీరానికి అవసరమైన శక్తి పుడుతుంది. ఆ శక్తి ఆహారానికి ఉన్న గుణం వల్ల ప్రభావితం అవుతుంది. ఈ గుణాలే ఇంద్రియాల పనితీరును నిర్ణయిస్తాయి. తమోగుణ ప్రధానంగా ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తే నిద్ర బద్ధకం అలసత్వం అలవాటు అవుతాయి. రజోగుణ ప్రధానమైన ఆహారాన్ని స్వీకరిస్తే కోపం, పోటీ తత్వం, అసహనం అలవాటు అవుతాయి. సత్వగుణ ప్రధానమైన ఆహారం వల్ల పిల్లల్లో శాంతం, మాట వినేతనం, పక్కవారితో పంచుకునేతనం అలవాటు అవుతాయి.

ఆహారం వల్లనే మనసు కూడా ఏర్పడుతుంది. అంటే ఆహారంలో ఉన్న స్వభావమే మనసు స్వభావం అవుతుంది. భోజన అలవాటు క్రమశిక్షణతో లేకపోతే మనసు విచక్షణను కోల్పోతుంది. ఆహారంలో పులుపులు, కారాలు ఎక్కువగా ఉంటే దానివల్ల తయారైన మనసు కూడా రజోగుణంతో ఉద్రేకంగా ఉంటుంది. సత్వగుణం ప్రధానంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనసు కూడా సత్వగుణంతో శాంతంగా ఉంటుంది.

అందుకే ఆహారాన్ని పరిమాణంలోనూ ప్రమాణంలోనూ ఉత్తమంగా ఉండేలా చూసుకుని తినాలి. కాల నియమాన్ని కచ్చితంగా పాటించాలి. ఆయా పదార్థాలకు ఉన్న గుణాల ప్రభావం ఏంటో తెలుసుకుని ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆహారాన్ని భుజించేటప్పుడు ఆలోచనలు దైవికంగా ఉంటే సత్ఫలితాలు వస్తాయి. మన పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగాలి అనుకునే వారి కోసం ఇది.

No comments:

Post a Comment