Friday, 29 May 2026

మనసుకు రెండు ముఖాలు

మనసుకి రెండు ముఖాలు. 

ఒకటి exitement .. అంటే ఉత్తేజం. 

రెండోది depression .. అంటే ఉద్వేగం. 

దృశ్యశ్రవణాల్లో ఏదో ఒకటి (లేదా రెండూ) .. 

అపూర్వం అనిపిస్తే అది ఉత్తేజం. 

అరరే లేదా అయ్యో అనిపిస్తే అది ఉద్వేగం.


ఉత్తేజం అంటే ఏమిటి? మనసు సమూహంలో ఉత్తేజాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే ఉత్తేజానికి ఆకర్షణ ఎక్కువ కాబట్టి. కాబట్టే అందరూ రూపం (అందం) ఇష్టపడతారు. అందుకే గ్రూపుల్లో దృశ్యాలు (ఫోటోలు), వాటికి likes ఎక్కువుంటాయి. ఇక శ్రవణం. అంటే మాటలు, పంచ్ కొటేషన్లు లాంటివి .. Inspiration అనీ, motivation అనీ share చెయ్యడం. 

ఈ రెండూ మనస్సుకు పనికిరావు.


ఇక ఉద్వేగం అంటే ఏమిటి. మనసు ఒంటరితనంలో ఉద్వేగాన్ని ఆశ్రయిస్తుంది. ఎందుకంటే ఉద్వేగానికి గుర్తింపు ఎక్కువ కాబట్టి. ప్రపంచం (లో) ఏదో అయిపోతుందని బాధ పడడం 'గుర్తింపు' కోరుకోవడమే. అన్నదానాల ప్రచారం, ఉద్వేగభరితమైన ప్రసంగాలు, వర్షంలో వృద్ధులకు గొడుగు పట్టడం, జంతువులను కాపాడడం వంటివి మనిషిలో ఉద్వేగాన్ని తట్టి లేపేవే. ఇలాంటివి share చేసుకోవడం మనసుకు అస్సలు పనికిరాదు.


మనసుకు ఉత్తేజం, ఉద్వేగం కలగనీయకుండా నిత్య జీవనాన్ని నియమబద్ధం చేసుకోవడమే "అభ్యాసం". దృశ్య శ్రవణాలు అభ్యాసానికి అవరోధాలు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. అలాంటి సత్య సాంగత్యం(సత్సాంగత్యం) లో కృష్ణుడు చెప్పిన అభ్యాసానికి ఈ రోజున అంకురార్పణ చేద్దాం.

Wednesday, 20 May 2026

మూడు కర్మలు - మూడు గుణాలు

ఈ ప్రపంచంలో జీవులందరూ ఏదో ఒక పని చేయడానికి motivate అవుతూనే ఉంటారు. ఆ పని 3 రకాలుగా, motivation 3 రకాలుగా ఉంటుంది.

పని (కర్మ) మూడు రకాలు.

అవి 1. కర్మ, 2. అకర్మ, 3. వికర్మ.

1. పెద్దలు చెప్పిన పనులను నియమానుసారం చేస్తూ ఉంటే అది కర్మ అవుతుంది. దీనికి వేదాలు, శాస్త్రాలు ప్రమాణం.

2. జనన, మరణ చక్రం నుంచి బయటపడటానికి .. అంటే మోక్షం కోసం మహా ఋషులు చెప్పిన పనులను చేస్తూ ఉంటే ఆ పని అకర్మ అవుతుంది. దీనికి ఆత్మజ్ఞానమే ప్రమాణం.

3. ఎటువంటి ప్రమాణాలను పట్టించుకోకుండా, తమకు నచ్చినట్లు చేసుకునే పనిని వికర్మ అంటారు.

Motivation కూడా మూడు రకాలు.

అవి 1. సత్వగుణం 2. రజోగుణం 3. తమోగుణం.

ఈ గుణాల ప్రమేయంతో జీవుడు అనుక్షణం ఆ మూడు కర్మల్లో దొర్లుతూనే ఉంటాడు. కర్మల లక్షణాన్ని బట్టి, గుణాల స్వభావాన్ని బట్టి మనిషి తాను చేసుకునే (కర్మలకు) పనులకు కష్టసుఖాలు, లాభనష్టాలు, ఎగుడుదిగుళ్లు అనుభవిస్తూ ఉంటాడు.

ఈ కర్మ ఫలాల్లో దేవుడికి గానీ, మనల్ని కష్ట - సుఖపెట్టిన మనుషులకు గానీ సంబంధం లేదా ప్రమేయం ఉండనే ఉండదు. ఎవరి కర్మ వారిదే.

అందుకే మనిషి తనకు నచ్చిన పనులు కాకుండా శాస్త్ర ప్రమాణాలున్న కర్మలను, అనుభవ ప్రమాణమున్న అకర్మలను చేస్తూ ఉండాలి.

Tuesday, 19 May 2026

శరణాగతి ఒకటే మార్గం

ప్రత్యక్ష ప్రయత్నం వల్ల పరోక్షమైన ఒక పరిణామం సంభవిస్తుంది. అంతే తప్ప పరోక్షమైన పరిణామాన్ని ప్రత్యక్షంగా సంభవింపజేయగలగడం ఎవరి వల్లా కాదు. అందుకే జయాపజయాలు దైవాధీనాలు అన్నారు.

ఎవరూ ఫలితాన్ని నిర్దేశించలేరు. కాబట్టే గీతలో శ్రీకృష్ణుడు ‘కర్మణ్యే వాధికారస్తే..’ అని స్పష్టంగా చెప్పాడు. ప్రయత్నంతో పరిశ్రమించడమే మానవుడి విద్యుక్తధర్మం. ఫలితం అనేది ఆ పరిశ్రమలో ఉన్న "ప్రకృతి నియమానికి" లోబడి ఉంటుంది. ఆ ఫలితం మన పరిశ్రమలోని లోటుపాట్లను, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అంతే తప్ప అది భగవంతుని అభిప్రాయం కాదు.

కష్టపడితే ఫలితం వస్తుంది అనేటువంటి మాట మనిషిని ఉత్తేజం చేయడానికి తప్ప సత్యాన్ని ప్రకటించడం కాదు. నేను ఎంత కష్టపడినా ఫలితం సరిగ్గా రాలేదు అనేటువంటి ఆవేదన సరైనటువంటి ఆలోచన కాదు. మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కనిపించే వ్యక్తులు గానీ, కనపడని దేవుడు కానీ కారణం కాదు.

ఇది తెలుసుకోకుండా ఇదేం దేవుడు, మంచికి విలువ లేదు అంటూ ఆలోచిస్తే అహంకారం, నైరాశ్యం మనల్ని చుట్టుకుంటాయి. ఈ విపరీతాల (extremities) నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి శరణాగతి ఒక్కటే మార్గమని మహా ఋషులు ప్రేమగా చెప్పారు. మనం చేసిన పనికి ఫలితం అనేది ప్రాకృతిక నియమాలకు ప్రాపంచిక పరిమితులకు లోబడి ఉంటుంది అని తెలుసుకొని మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి.

Wednesday, 13 May 2026

శరీరాన్ని సార్ధకం చేసుకోవాలి

మహాయుగాలు మన్వంతరాలు గడిచినా కూడా మనిషి శరీర నిర్మాణం, దాని సామర్థ్యం ఇప్పటికీ మారలేదు. ఇక ఎప్పటికీ మారదు. అట్లాంటి శరీరాన్ని గత మూడు తరాలుగా నిర్లక్ష్యం చేస్తూ మన పతనాన్ని మనమే నిర్మించుకున్నాం. దీనికి ఇక మంగళం పాడాల్సిన సమయం వచ్చింది.

మనిషి శరీరం ఒక మహోజ్వలమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని భారతీయ సనాతనులు అద్భుతంగా వినియోగించుకుని మహా ఋషులుగా మారారు. అంటే మనిషిని మహా ఋషిగా మార్చగలిగిన ప్రధానమైన ఉపాధి శరీరమే అని అర్థం చేసుకోవాలి. శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలి తద్వారా ఎలా ఉద్దతిని పొందాలి అనే విషయాన్ని మూలాల నుంచి తెలుసుకుంటేనే మనం విజయం సాధించగలం. ఆ విధంగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది.

ఈ దిశగా మనం చేయాల్సిన పని ఒక్కటే. శరీరం అనేది కేవలం భౌతిక ఆనందం కోసం మాత్రమే కాదని, శరీరాన్ని ఇంద్రియాల లోలత్వంలో ముంచకూడదని, భౌతిక సుఖాల కోసమే ఈ శరీరం ఉందని భావించే దౌర్భాగ్యం నుంచి మనం బయటపడాలి. పరిస్థితుల వల్ల మనకి ఎదురయ్యే కష్టనష్టాలకు మనసు కల్లోలం అవకుండా మౌనంగా ప్రశాంతంగా ఉండగల అద్భుత స్థితిని మనం పొందాలంటే దానికి ప్రధానమైన సాధనం శరీరమే అని గుర్తించాలి.

శరీరం యొక్క నిర్మాణం, దానిలోని అవయవాల మధ్య ఉన్న సమన్వయం, ఆ సమన్వయం ద్వారా ఏర్పడే శక్తి, అలాంటి శక్తిని పొందగలిగిన విధానం, ఆ విధానాన్ని పాటించగలిగిన నేర్పరితనం ఇత్యాది విషయాలన్నింటి గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అందుకోసం  మనం ఈ శరీర నిర్మాణ వ్యవస్థ గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి.

శరీరం అంటే కండలు పెంచడం కాదు, ఆరోగ్యంగా ఉండటమే కాదు, సమయానికి సముచిత ఆహారాన్ని దానికి అందించడం మాత్రమే కాదు, దానికి తగిన విశ్రాంతిని ఇవ్వడం ఒక్కటే కాదు. వాటన్నింటినీ సమకూర్చినప్పుడు అది ఇవ్వగలిగిన ఆంతరంగిక శక్తిని మనం పొందగలిగినప్పుడే మనం శరీరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు లెక్క.  

ఇలా శరీరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన మెలకువలు అన్నీ భారతీయ సనాతన విద్యలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆ మెలకువలను అర్థం చేసుకుని శరీరాన్ని సార్ధకం చేసుకుందాం.

Sunday, 3 May 2026

ఈ సద్విషయాలు తెలుసుకుందాం

ప్రాణం అంటే అనంతమైన శక్తిలోంచి విడివడిన అత్యంత సూక్ష్మమైన తునక. ఈ నిరాకార తునక ప్రకృతిలోకి వచ్చినపుడు, దేహం అనే ఆకారం అవుతుంది. ప్రకృతి పరిధిలోని దేహం .. దశేంద్రియాల, మనో బుద్ధి చిత్తహంకారాల మయం. వాటి విన్యాసాలతో క్షీణించే ప్రాణానికి యోగబలాన్ని ఎక్కించడమే ‘సాధన’. యోగబలంతో నిండిన ప్రాణమే శివుడు. కర్మభారంతో కదిలే ప్రాణమే జీవుడు.


తానెవరో తెలుసుకునే దృష్టి, తృష్ణ లేకపోతే .. ఏదో ఒక రోజు తనకు తానే ప్రశ్నార్థకంగా మిగిలిపోతాడని వేదాంతం హెచ్చరించింది. నువ్వెవరో నీకు తెలియనప్పుడు, మనసుకు తెలుస్తున్న మిగిలిన విషయాలన్నీ మన అహంకారానికి ప్రతీకలే.

 

'నేనేవరు?' అన్న ప్రశ్నకి (ఎన్ని ప్రయత్నాలు చేసినా) సూటి సమాధానం దొరకదు. మనసుకు తెలిసిన, తెలుస్తున్న ప్రతిదాన్ని ఇదికాదు అని వదిలేస్తూ పోతూ ఉంటే, చివరికి 'నేను' అనుభవమవుతుంది. నా గురించి నాకు తెలిసిన నా ఉనికి, నా గురించి ఇతరులు గుర్తిస్తున్న నా ఉనికి కాకుండా .. అప్రమేయంగా కదులుతున్న 'నేను' ఎవరో తెలియడమే నిరహంకారం.


సృష్టిలో శక్తిని క్షీణింపజేసే పదార్ధాల నుంచి దూరమై, శక్తిని వృద్ధి చేసే పదార్ధాలకు చేరువై .. జీవనం సాగించడమే మన విధి. ఈ విధి విధానాలను వివరించేదే ఋషిమార్గం. ఋషిమార్గంలో నడవడం అంటే .. జీవుడు తానుగా పదార్ధ భావన నుంచి దూరమై .. శక్తి స్థితికి చేరడానికి ప్రయత్నించడం.


ఋషిమార్గంలో నడిచే వారికి సర్వోత్కృష్టమైన ఊతకర్ర ‘‘సాలగ్రామం’’. సృష్టిలో విశ్వశక్తిని యథాతథంగా కలిగి ఉన్న పదార్ధం సాలగ్రామం ఒక్కటే. సాలగ్రామాన్ని సేవించకుండా ఏ మనిషీ .. ఋషి అవలేడు .. అవలేదు. అంతటి విశేషత, విశిష్టత ఉన్న సాలగ్రామాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ సమర్ధత మేరకు ప్రత్యక్ష పరోక్ష స్థితుల్లో ఆరాధించుకోవడానికి ప్రయత్నించాలి.


అనుభవం తరవాతే అన్నీ పుట్టాయి. అలా పుట్టిన వాటిలో "అక్షరం" చాలా శక్తి వంతమైనది. ఎందుకంటే అది శబ్దానికి రూపాన్ని ఇవ్వగలుగుతుంది. శబ్దం అంటే సృష్టి యొక్క సూక్ష్మ స్థితిని ప్రభావితం చేయగల శక్తి. అటువంటి శక్తిని అక్షరాల సంపుటిలో ఉన్నప్పుడు దాన్ని మంత్రం అంటారు. ఈ మాత్రమే మనిషిని అక్షర జ్ఞానం లోంచి అనుభవసారంలోకి తీసుకు వెళుతుంది. కొసమెరుపు ఏమిటంటే .. అనుభవం .. 'అక్షరం' లోకి translate అవదు, అవలేదు.


"నేనే ఆనంద స్వరూపం". ఈ సత్యం, అనుభవం అవడమే 'జ్ఞానం'. సాధన చేస్తేనే అనుభవం వస్తుంది. సాధన మూడంచెలు. 1.శ్రవణ 2 మనన 3 నిదిధ్యాసలు. అంటే ఆథ్యాత్మిక సాధనలో "శ్రవణం" అత్యంత కీలకం. శ్రవణము (గురువును అనుసరించుట) సులభమైన తర్వాతే మననము ఫలితమిస్తుంది. 


సృష్టిలో  మారునదే తప్ప .. పోవునది, మిగులునది అనేవి ఉండవు. మార్పు ఒక్కటే సృష్టి లక్షణం. అందుకే సృష్టి అంశములకు శాశ్వతత్వం ఉండదు. అలాగే గురువు 'ఇలా చేసుకో' అని చెపుతాడు తప్ప .. ఎవరు ఏమి అవుతారో అన్న విషయం ఎవరికీ తెలియదు.


ఆథ్యాత్మిక అంశం అనుభవంలో తెలిసేది, ప్రపంచ అంశం మాటల్లో తెలిసేది. సాధన వల్ల అనుభవం వస్తుంది. మాట వల్ల తర్కం పెరుగుతుంది. అనుభవం ఆనందానికి, తర్కం ఘర్షణకు దారి తీస్తుంది.


ఆలోచన లేకుండా క్రియ చేయడం సాధ్యమే.. అయితే అది "పరోక్షం"గా మాత్రమే వీలవుతుంది. ఉదాహరణకు .. మీ ఆలోచనతో సంబంధం లేని ఒక పనిని నేను చేయమన్నప్పుడు, ఆ పనిని మీరు చేశారనుకోండి .. ఆ పనిని మీరు ఆలోచన లేకుండా చేసినట్టు. ఆ పని విధానం అనేది ఎప్పుడూ ఆలోచనలో ఉంటుంది..కానీ దాని result మీ ఆలోచనకు అందదు. గురువును అనుసరించడం, గురువు మాటను ఆచరించడం ఈ కోవ లోదే.


ఆలోచన మనసు నుంచి generate అవుతుంది. సంకల్పానికి మూలం బుద్ధి. మనసు ఏ దిశగానైనా పరుగెడుతుంది. కానీ బుద్ధి .. (పుణ్య-పాప) కర్మ ప్రకారమే కదులుతుంది. బుద్దిని బలోపేతం చేస్తే అది మనసుతో కలవకుండా, సత్సంకల్పాలకి మూలం అవుతుంది. అందుకే  మనిషి అంటే మనసున్నవాడు కాదు, బుద్ధిమంతుడు.


"ప్రశ్న-జవాబు" అనేవి శాస్ర పరిధిలోవి. "సంశయం-అనుభవం" అనేవి ఆథ్యాత్మిక పరిధిలోవి. శాస్త్రం మేధస్సుకి, ఆథ్యాత్మికం సాధనకి సంబంధించినవి. శాస్త్ర విషయాలు చర్చని, సాధనాంశాలు ప్రజ్ఞని పెంచుతాయి. వల్లె వేస్తే వేదం నోటికి వస్తుంది కానీ జపం చేస్తేనే తప్ప వేదాంతం అనుభవం లోకి రాదు. ప్రశ్నించే మనస్సును అదపులో ఉంచేది చేత ఒక్కటే. కర్మ జీవులకి అనుష్టానము, జపము తప్ప మరో చేత లేదు.


వ్యక్తిని కాకుండా విషయాన్ని 'గురువు'గా స్వీకరించ గలిగిన వాడు మాత్రమే 'చెప్పింది విని చేతలోకి దూకుతాడు'. విషయాన్ని గురువుగా స్వీకరించేంత పరిపక్వత రావాలంటే .. తర్కించే మనసు వేగాన్ని అదుపు చేయాల్సిందే. అభ్యాస వైరాగ్యాలతోనే అది సాధ్యమని కృష్ణుడు గీతలో చెప్పాడు. వేదాలు అనేవి విధానాలు, ఉపనిషత్తులు అనేవి చేతలు. అందుకే శ్రీకృష్ణుడు 'చేతలోకి దూకు' అని చెప్పిన గీత .. ఉపనిషత్తుల సారం అయ్యింది.


"అంతర్ముఖం" తప్ప మిగిలినదంతా డంబమే. అలాంటి అంతర్ముఖం ప్రేరేపించిన 'చేత' తప్ప -- మిగిలిన చేతలన్నీ డంబాచారమే. అంటే భగవంతునితో సంబంధం లేనిది అని అర్థం. అంతటి తీక్షణతను అనుక్షణం ధరించే శక్తిని ఇవ్వగలిగినది "అనుష్టానం" ఒక్కటే. అనుష్టానం అంటే సాధన.