Wednesday, 20 May 2026

మూడు కర్మలు - మూడు గుణాలు

ఈ ప్రపంచంలో జీవులందరూ ఏదో ఒక పని చేయడానికి motivate అవుతూనే ఉంటారు. ఆ పని 3 రకాలుగా, motivation 3 రకాలుగా ఉంటుంది.

పని (కర్మ) మూడు రకాలు.

అవి 1. కర్మ, 2. అకర్మ, 3. వికర్మ.

1. పెద్దలు చెప్పిన పనులను నియమానుసారం చేస్తూ ఉంటే అది కర్మ అవుతుంది. దీనికి వేదాలు, శాస్త్రాలు ప్రమాణం.

2. జనన, మరణ చక్రం నుంచి బయటపడటానికి .. అంటే మోక్షం కోసం మహా ఋషులు చెప్పిన పనులను చేస్తూ ఉంటే ఆ పని అకర్మ అవుతుంది. దీనికి ఆత్మజ్ఞానమే ప్రమాణం.

3. ఎటువంటి ప్రమాణాలను పట్టించుకోకుండా, తమకు నచ్చినట్లు చేసుకునే పనిని వికర్మ అంటారు.

Motivation కూడా మూడు రకాలు.

అవి 1. సత్వగుణం 2. రజోగుణం 3. తమోగుణం.

ఈ గుణాల ప్రమేయంతో జీవుడు అనుక్షణం ఆ మూడు కర్మల్లో దొర్లుతూనే ఉంటాడు. కర్మల లక్షణాన్ని బట్టి, గుణాల స్వభావాన్ని బట్టి మనిషి తాను చేసుకునే (కర్మలకు) పనులకు కష్టసుఖాలు, లాభనష్టాలు, ఎగుడుదిగుళ్లు అనుభవిస్తూ ఉంటాడు.

ఈ కర్మ ఫలాల్లో దేవుడికి గానీ, మనల్ని కష్ట - సుఖపెట్టిన మనుషులకు గానీ సంబంధం లేదా ప్రమేయం ఉండనే ఉండదు. ఎవరి కర్మ వారిదే.

అందుకే మనిషి తనకు నచ్చిన పనులు కాకుండా శాస్త్ర ప్రమాణాలున్న కర్మలను, అనుభవ ప్రమాణమున్న అకర్మలను చేస్తూ ఉండాలి.

Tuesday, 19 May 2026

శరణాగతి ఒకటే మార్గం

ప్రత్యక్ష ప్రయత్నం వల్ల పరోక్షమైన ఒక పరిణామం సంభవిస్తుంది. అంతే తప్ప పరోక్షమైన పరిణామాన్ని ప్రత్యక్షంగా సంభవింపజేయగలగడం ఎవరి వల్లా కాదు. అందుకే జయాపజయాలు దైవాధీనాలు అన్నారు.

ఎవరూ ఫలితాన్ని నిర్దేశించలేరు. కాబట్టే గీతలో శ్రీకృష్ణుడు ‘కర్మణ్యే వాధికారస్తే..’ అని స్పష్టంగా చెప్పాడు. ప్రయత్నంతో పరిశ్రమించడమే మానవుడి విద్యుక్తధర్మం. ఫలితం అనేది ఆ పరిశ్రమలో ఉన్న "ప్రకృతి నియమానికి" లోబడి ఉంటుంది. ఆ ఫలితం మన పరిశ్రమలోని లోటుపాట్లను, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అంతే తప్ప అది భగవంతుని అభిప్రాయం కాదు.

కష్టపడితే ఫలితం వస్తుంది అనేటువంటి మాట మనిషిని ఉత్తేజం చేయడానికి తప్ప సత్యాన్ని ప్రకటించడం కాదు. నేను ఎంత కష్టపడినా ఫలితం సరిగ్గా రాలేదు అనేటువంటి ఆవేదన సరైనటువంటి ఆలోచన కాదు. మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కనిపించే వ్యక్తులు గానీ, కనపడని దేవుడు కానీ కారణం కాదు.

ఇది తెలుసుకోకుండా ఇదేం దేవుడు, మంచికి విలువ లేదు అంటూ ఆలోచిస్తే అహంకారం, నైరాశ్యం మనల్ని చుట్టుకుంటాయి. ఈ విపరీతాల (extremities) నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి శరణాగతి ఒక్కటే మార్గమని మహా ఋషులు ప్రేమగా చెప్పారు. మనం చేసిన పనికి ఫలితం అనేది ప్రాకృతిక నియమాలకు ప్రాపంచిక పరిమితులకు లోబడి ఉంటుంది అని తెలుసుకొని మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి.

Wednesday, 13 May 2026

శరీరాన్ని సార్ధకం చేసుకోవాలి

మహాయుగాలు మన్వంతరాలు గడిచినా కూడా మనిషి శరీర నిర్మాణం, దాని సామర్థ్యం ఇప్పటికీ మారలేదు. ఇక ఎప్పటికీ మారదు. అట్లాంటి శరీరాన్ని గత మూడు తరాలుగా నిర్లక్ష్యం చేస్తూ మన పతనాన్ని మనమే నిర్మించుకున్నాం. దీనికి ఇక మంగళం పాడాల్సిన సమయం వచ్చింది.

మనిషి శరీరం ఒక మహోజ్వలమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని భారతీయ సనాతనులు అద్భుతంగా వినియోగించుకుని మహా ఋషులుగా మారారు. అంటే మనిషిని మహా ఋషిగా మార్చగలిగిన ప్రధానమైన ఉపాధి శరీరమే అని అర్థం చేసుకోవాలి. శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలి తద్వారా ఎలా ఉద్దతిని పొందాలి అనే విషయాన్ని మూలాల నుంచి తెలుసుకుంటేనే మనం విజయం సాధించగలం. ఆ విధంగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది.

ఈ దిశగా మనం చేయాల్సిన పని ఒక్కటే. శరీరం అనేది కేవలం భౌతిక ఆనందం కోసం మాత్రమే కాదని, శరీరాన్ని ఇంద్రియాల లోలత్వంలో ముంచకూడదని, భౌతిక సుఖాల కోసమే ఈ శరీరం ఉందని భావించే దౌర్భాగ్యం నుంచి మనం బయటపడాలి. పరిస్థితుల వల్ల మనకి ఎదురయ్యే కష్టనష్టాలకు మనసు కల్లోలం అవకుండా మౌనంగా ప్రశాంతంగా ఉండగల అద్భుత స్థితిని మనం పొందాలంటే దానికి ప్రధానమైన సాధనం శరీరమే అని గుర్తించాలి.

శరీరం యొక్క నిర్మాణం, దానిలోని అవయవాల మధ్య ఉన్న సమన్వయం, ఆ సమన్వయం ద్వారా ఏర్పడే శక్తి, అలాంటి శక్తిని పొందగలిగిన విధానం, ఆ విధానాన్ని పాటించగలిగిన నేర్పరితనం ఇత్యాది విషయాలన్నింటి గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అందుకోసం  మనం ఈ శరీర నిర్మాణ వ్యవస్థ గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి.

శరీరం అంటే కండలు పెంచడం కాదు, ఆరోగ్యంగా ఉండటమే కాదు, సమయానికి సముచిత ఆహారాన్ని దానికి అందించడం మాత్రమే కాదు, దానికి తగిన విశ్రాంతిని ఇవ్వడం ఒక్కటే కాదు. వాటన్నింటినీ సమకూర్చినప్పుడు అది ఇవ్వగలిగిన ఆంతరంగిక శక్తిని మనం పొందగలిగినప్పుడే మనం శరీరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు లెక్క.  

ఇలా శరీరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన మెలకువలు అన్నీ భారతీయ సనాతన విద్యలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆ మెలకువలను అర్థం చేసుకుని శరీరాన్ని సార్ధకం చేసుకుందాం.

Sunday, 3 May 2026

ఈ సద్విషయాలు తెలుసుకుందాం

ప్రాణం అంటే అనంతమైన శక్తిలోంచి విడివడిన అత్యంత సూక్ష్మమైన తునక. ఈ నిరాకార తునక ప్రకృతిలోకి వచ్చినపుడు, దేహం అనే ఆకారం అవుతుంది. ప్రకృతి పరిధిలోని దేహం .. దశేంద్రియాల, మనో బుద్ధి చిత్తహంకారాల మయం. వాటి విన్యాసాలతో క్షీణించే ప్రాణానికి యోగబలాన్ని ఎక్కించడమే ‘సాధన’. యోగబలంతో నిండిన ప్రాణమే శివుడు. కర్మభారంతో కదిలే ప్రాణమే జీవుడు.


తానెవరో తెలుసుకునే దృష్టి, తృష్ణ లేకపోతే .. ఏదో ఒక రోజు తనకు తానే ప్రశ్నార్థకంగా మిగిలిపోతాడని వేదాంతం హెచ్చరించింది. నువ్వెవరో నీకు తెలియనప్పుడు, మనసుకు తెలుస్తున్న మిగిలిన విషయాలన్నీ మన అహంకారానికి ప్రతీకలే.

 

'నేనేవరు?' అన్న ప్రశ్నకి (ఎన్ని ప్రయత్నాలు చేసినా) సూటి సమాధానం దొరకదు. మనసుకు తెలిసిన, తెలుస్తున్న ప్రతిదాన్ని ఇదికాదు అని వదిలేస్తూ పోతూ ఉంటే, చివరికి 'నేను' అనుభవమవుతుంది. నా గురించి నాకు తెలిసిన నా ఉనికి, నా గురించి ఇతరులు గుర్తిస్తున్న నా ఉనికి కాకుండా .. అప్రమేయంగా కదులుతున్న 'నేను' ఎవరో తెలియడమే నిరహంకారం.


సృష్టిలో శక్తిని క్షీణింపజేసే పదార్ధాల నుంచి దూరమై, శక్తిని వృద్ధి చేసే పదార్ధాలకు చేరువై .. జీవనం సాగించడమే మన విధి. ఈ విధి విధానాలను వివరించేదే ఋషిమార్గం. ఋషిమార్గంలో నడవడం అంటే .. జీవుడు తానుగా పదార్ధ భావన నుంచి దూరమై .. శక్తి స్థితికి చేరడానికి ప్రయత్నించడం.


ఋషిమార్గంలో నడిచే వారికి సర్వోత్కృష్టమైన ఊతకర్ర ‘‘సాలగ్రామం’’. సృష్టిలో విశ్వశక్తిని యథాతథంగా కలిగి ఉన్న పదార్ధం సాలగ్రామం ఒక్కటే. సాలగ్రామాన్ని సేవించకుండా ఏ మనిషీ .. ఋషి అవలేడు .. అవలేదు. అంతటి విశేషత, విశిష్టత ఉన్న సాలగ్రామాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ సమర్ధత మేరకు ప్రత్యక్ష పరోక్ష స్థితుల్లో ఆరాధించుకోవడానికి ప్రయత్నించాలి.


అనుభవం తరవాతే అన్నీ పుట్టాయి. అలా పుట్టిన వాటిలో "అక్షరం" చాలా శక్తి వంతమైనది. ఎందుకంటే అది శబ్దానికి రూపాన్ని ఇవ్వగలుగుతుంది. శబ్దం అంటే సృష్టి యొక్క సూక్ష్మ స్థితిని ప్రభావితం చేయగల శక్తి. అటువంటి శక్తిని అక్షరాల సంపుటిలో ఉన్నప్పుడు దాన్ని మంత్రం అంటారు. ఈ మాత్రమే మనిషిని అక్షర జ్ఞానం లోంచి అనుభవసారంలోకి తీసుకు వెళుతుంది. కొసమెరుపు ఏమిటంటే .. అనుభవం .. 'అక్షరం' లోకి translate అవదు, అవలేదు.


"నేనే ఆనంద స్వరూపం". ఈ సత్యం, అనుభవం అవడమే 'జ్ఞానం'. సాధన చేస్తేనే అనుభవం వస్తుంది. సాధన మూడంచెలు. 1.శ్రవణ 2 మనన 3 నిదిధ్యాసలు. అంటే ఆథ్యాత్మిక సాధనలో "శ్రవణం" అత్యంత కీలకం. శ్రవణము (గురువును అనుసరించుట) సులభమైన తర్వాతే మననము ఫలితమిస్తుంది. 


సృష్టిలో  మారునదే తప్ప .. పోవునది, మిగులునది అనేవి ఉండవు. మార్పు ఒక్కటే సృష్టి లక్షణం. అందుకే సృష్టి అంశములకు శాశ్వతత్వం ఉండదు. అలాగే గురువు 'ఇలా చేసుకో' అని చెపుతాడు తప్ప .. ఎవరు ఏమి అవుతారో అన్న విషయం ఎవరికీ తెలియదు.


ఆథ్యాత్మిక అంశం అనుభవంలో తెలిసేది, ప్రపంచ అంశం మాటల్లో తెలిసేది. సాధన వల్ల అనుభవం వస్తుంది. మాట వల్ల తర్కం పెరుగుతుంది. అనుభవం ఆనందానికి, తర్కం ఘర్షణకు దారి తీస్తుంది.


ఆలోచన లేకుండా క్రియ చేయడం సాధ్యమే.. అయితే అది "పరోక్షం"గా మాత్రమే వీలవుతుంది. ఉదాహరణకు .. మీ ఆలోచనతో సంబంధం లేని ఒక పనిని నేను చేయమన్నప్పుడు, ఆ పనిని మీరు చేశారనుకోండి .. ఆ పనిని మీరు ఆలోచన లేకుండా చేసినట్టు. ఆ పని విధానం అనేది ఎప్పుడూ ఆలోచనలో ఉంటుంది..కానీ దాని result మీ ఆలోచనకు అందదు. గురువును అనుసరించడం, గురువు మాటను ఆచరించడం ఈ కోవ లోదే.


ఆలోచన మనసు నుంచి generate అవుతుంది. సంకల్పానికి మూలం బుద్ధి. మనసు ఏ దిశగానైనా పరుగెడుతుంది. కానీ బుద్ధి .. (పుణ్య-పాప) కర్మ ప్రకారమే కదులుతుంది. బుద్దిని బలోపేతం చేస్తే అది మనసుతో కలవకుండా, సత్సంకల్పాలకి మూలం అవుతుంది. అందుకే  మనిషి అంటే మనసున్నవాడు కాదు, బుద్ధిమంతుడు.


"ప్రశ్న-జవాబు" అనేవి శాస్ర పరిధిలోవి. "సంశయం-అనుభవం" అనేవి ఆథ్యాత్మిక పరిధిలోవి. శాస్త్రం మేధస్సుకి, ఆథ్యాత్మికం సాధనకి సంబంధించినవి. శాస్త్ర విషయాలు చర్చని, సాధనాంశాలు ప్రజ్ఞని పెంచుతాయి. వల్లె వేస్తే వేదం నోటికి వస్తుంది కానీ జపం చేస్తేనే తప్ప వేదాంతం అనుభవం లోకి రాదు. ప్రశ్నించే మనస్సును అదపులో ఉంచేది చేత ఒక్కటే. కర్మ జీవులకి అనుష్టానము, జపము తప్ప మరో చేత లేదు.


వ్యక్తిని కాకుండా విషయాన్ని 'గురువు'గా స్వీకరించ గలిగిన వాడు మాత్రమే 'చెప్పింది విని చేతలోకి దూకుతాడు'. విషయాన్ని గురువుగా స్వీకరించేంత పరిపక్వత రావాలంటే .. తర్కించే మనసు వేగాన్ని అదుపు చేయాల్సిందే. అభ్యాస వైరాగ్యాలతోనే అది సాధ్యమని కృష్ణుడు గీతలో చెప్పాడు. వేదాలు అనేవి విధానాలు, ఉపనిషత్తులు అనేవి చేతలు. అందుకే శ్రీకృష్ణుడు 'చేతలోకి దూకు' అని చెప్పిన గీత .. ఉపనిషత్తుల సారం అయ్యింది.


"అంతర్ముఖం" తప్ప మిగిలినదంతా డంబమే. అలాంటి అంతర్ముఖం ప్రేరేపించిన 'చేత' తప్ప -- మిగిలిన చేతలన్నీ డంబాచారమే. అంటే భగవంతునితో సంబంధం లేనిది అని అర్థం. అంతటి తీక్షణతను అనుక్షణం ధరించే శక్తిని ఇవ్వగలిగినది "అనుష్టానం" ఒక్కటే. అనుష్టానం అంటే సాధన.

Thursday, 30 April 2026

శక్తి - పదార్ధం - సమాధి

సృష్టిలో ఉన్నవి రెండే. ఒకటి శక్తి .. రెండవది పదార్ధము. వీటిలో శక్తి అగోచరము, అనుభవ దూరము. కాబట్టే పదార్ధమే ఈ సృష్టిలో అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. అన్ని జీవరాశుల్లో మహా తెలివైన మనిషి ఈ పదార్ధాలను తన అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ, ఆ సామర్ధ్యాన్ని తన శక్తిగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ పటాటోపానికి ఆ మనిషి సైన్స్‌ అని పేరు పెట్టుకున్నాడు. ఇలా సైన్స్‌ వర్గానికి చెందిన వారంతా మేధావులుగా ఖ్యాతికెక్కారు. అయితే సైన్స్‌కి ఆధారమైన పదార్ధంలో ఉన్నది కూడా శక్తేననీ, ఆ శక్తి చలనంలో ఉన్న మార్పులు చేర్పులే పదార్ధ స్వరూప స్వభావాల్లో ఉన్న తేడాలనీ గమనించిన కొందరు, అసలు శక్తికి ఉన్న లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని అన్వేషణ మొదలుపట్టారు. వారిని తాత్వికులు అన్నారు. 

ఒక బుల్లెట్‌ని తీసుకుందాం. దానితో ఒక మనిషిని ఎంత బలంగా కొట్టినా ఏమీ అవదు. అదే బుల్లెట్‌ని రివాల్వర్‌లో పెట్టి వదిలితే మనిషిని చంపేస్తుంది. కాబట్టి బల్లెట్‌ అనే పదార్ధానికి వేగం అనే శక్తి లేకపోతే నిరుపయోగమే. అంటే పదార్ధంలోకి శక్తిని ప్రవేశపడితేనే ఫలితం ఉంటుంది. ఇది సైంటిఫిక్‌ థింకింగ్‌. 

మరి శక్తిలోకి పదార్ధాన్ని ప్రవేశపెడితే? ఫలితం ఊహించనంత తీవ్రంగా ఉంటుంది. ఇది తాత్విక థింకింగ్‌. ఈ తాత్విక థింకింగ్‌ని సైంటిఫిక్‌గా వివరించడం అసాధ్యం. కనపడని శక్తిలోకి కనపడే పదార్థాన్ని ఎలా పెట్టాలి? సమాధానం శోధిస్తూ కదిలిన తాత్వికులు అరణ్యాల్లో తేలారు. పరిసరాలు, పర్యావరణం అనుకూలించడంతో అంతర్ముఖమయ్యారు. శక్తి, పదార్ధాల గుట్టు విప్పే పనిలో విజయం సాధించారు. 

పదార్ధ స్థితికి చేరువలో ఉన్న శక్తి శబ్దమేనని, శక్తికి చేరువలో ఉన్న పదార్ధం మనసేనని గుర్తించారు. ఇక మనసుని ఎలాగైనా శక్తిలో పెట్టే పనిలోకి దూకి చావుదెబ్బలు తిన్నారు. చివరికి మనసుని పట్టుకోవడం అసంభవం అని తీర్మానించారు. ఈ యుద్దంలో వారికి మనసు లక్షణాలన్నీ తెలిశాయి. మనసు దేనినైనా ఒడిసిపట్టగలదనీ, తన ఆస్వాదన పూర్తి కాగానే దేనినైనా దూరంగా విసిరి వెయ్యగలదనీ గమనించి .. ఏమీ చెయ్యలేక .. బుద్ధిగా ఓ మూల కూర్చున్నారు.

మనసుని ఏనుగుతో పోల్చవచ్చు. ఏనుగును బంధించాలంటే ముందుగా దానిని కదలకుండా చెయ్యాలి. ఎలా? సరిగ్గా అది పట్టే గుంటలో పడెయ్యాలి. కానీ గుంట ఉన్న సంగతిని ఏనుగు తన తొండంతో పసిగట్టెయ్య గలదు. కానీ ఆ పసిగట్టే పనినుంచి ఏనుగు దృష్టిని మళ్లించే గందరగోళాన్ని సృష్టించి గొయ్యి ఉన్న వైపు మళ్లిస్తే ఆ ఏనుగుని గోతిలో  పడెయ్యచ్చు. ఈ భౌతిక సూత్రాన్ని తాత్వికులు మనసుకి వర్తింపజేశారు. 

మనసుకి ఓ లక్షణం ఉంది. ఇంద్రియాలు గ్రహించిన ప్రతి దానినీ రుచి చూడనిదే వదిలిపెట్టదు. తను రుచి చూసిన ప్రతి దానినీ దూరంగా విసిరెయ్యక మానదు. ఈ రెండు పనుల సంధికాలంలోనే మనసును శాశ్వతంగా పట్టి వెయ్యాలి. అదీ తాత్వికుల వ్యూహం. పదార్ధాలలో అత్యంత సూక్ష్మమైనదీ, వేగమైనదీ, బలమైనదీ మనసే కాబట్టి ఏ పదార్ధమూ దానిని పట్టలేదు. ఇక శక్తిని ఉపయోగించాలి. కానీ మనసుకి శక్తి అంటే ఏమిటో తెలుసుకునే శక్తే లేదు. కాబట్టి అది శక్తి జోలికి రాలేదు. అందుకే ఇటు శక్తి రూపానికి .. అటు పదార్ధ లక్షణానికి చేరువలో ఉన్న శబ్దాన్ని మథించారు. 

శబ్దం అధిభౌతికమే అయినా దానికి వాక్కు, అక్షరం అనే భౌతిక (ఇంద్రియ) స్థితులున్నాయి. ఈ అవకాశాన్ని తాత్వికులు ఊతంగా తీసుకున్నారు. అక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఆ ఉచ్చరించిన దానిని వినడం ప్రారంభించారు. 'వినడం' ఇంద్రియ స్థితి కాబట్టి మనసు దానిని ఆస్వాదించడానికి వచ్చి తీరుతుంది. అలా ఆస్వాదిస్తుండగా .. శబ్దం (శక్తి) తన లక్షణం మేరకు ఆ మనసును తనలో కలిపేసుకుంటుంది. అంటే గుణ భూయిష్టమైన మనసు స్వభావాన్ని మార్చేస్తుంది. విజయవంతమైన ఈ ప్రయత్నమే ఆత్యాత్మికానికి పునాది అయింది.
శబ్దంతోో మనసును పూర్ణంగా శుద్ధి చేసుకున్న తాత్వికులే ఋషులు. మనసును పూర్ణంగా శుద్ధి చేయగల ఋషిప్రోక్తమైన శబ్దాలే మంత్రాలు. మంత్రాక్షరాలను ఉచ్చరిస్తూ, ఆ మంత్రాక్షరాలను వినడమే జపం. శబ్దం పరిపూర్ణంగా మనసును తనలో కలిపేసుకున్నపుడే సమాధి.

యజ్ఞం - పరమార్ధం

ఉత్తమ లక్ష్యాన్ని ఫలరూపకంగా విశ్వవ్యాపితం చేయాలంటే యజ్ఞం ఒక్కటే మార్గం. అదే విధంగా మానవుల్లో అత్యుత్తమ లక్షణాలు పాదుకొని వికసించాలన్నా యజ్ఞమే సాధనం. అందుకే మనిషి నిర్వహించగల అత్యుత్తమ ప్రక్రియగా యజ్ఞం నిలిచింది. 

కచ్చితంగా చెప్పాలంటే .. ఒక అంశం పలురెట్లుగా వ్యాప్తి చెంది అనేక మందికి హితకారి అవ్వాలంటే యజ్ఞం తప్ప మరో ఉపాయం లేదు. ఒక వ్యక్తి త్యాగం కూడా ద్విగుణీకృతమై సంఘ శ్రేయస్సును సాధించాలంటే యజ్ఞం జరగడం తప్పనిసరి. 

స్థూలమైన శబ్ద తరంగాలు యజ్ఞ జ్వాలల ద్వారా సూక్ష్మీకరణ చెందుతాయని సైన్స్‌ కూడా ఒప్పుకుంది. అంటే స్థూలాన్ని సూక్ష్మంగానూ, పలు రెట్లు గానూ, వ్యాప్తి చెందించగల సమర్ధత యజ్ఞక్రియకు ఉన్నట్టే కదా. అందుకే సనాతనులు యజ్ఞ క్రియను మానవ దైనందిన జీవితంలో ఒక భాగంగా నిర్దేశించారు. 

వారి నిర్దేశన మేరకు నిత్యం యజ్ఞాలు, హోమాలు జరుగున్నంత కాలం సకల జీవరాశులూ శాంతిని, ఆనందాన్ని అనుభవించాయి. సంఘం కళకళలాడింది. కాబట్టి సృష్టికి హితకరంగా సమాజం చైతన్యమవాలంటే .. యజ్ఞక్రియ దేదీప్యమానమవ్వాలని నమ్మాలి.

మనపై ప్రత్యక్ష  ప్రభావం ఉన్న పంచభూత తత్వాలకు, గ్రహ తత్వాలకు బలాన్ని చేకూర్చగల ప్రక్రియనూ .. సూక్ష్మ స్థితిలో .. సాధించగల విధానం కూడా యజ్ఞమే. ఇంతటి ప్రభావశీలమైన యజ్ఞక్రియ మరుగున పడిపోవడానికి నికార్సైన కారణం .. వ్యక్తి మనోవికాస ప్రక్రియ నీరసపడిపోవడమే. ఎందుకంటే యజ్ఞక్రియకు వ్యక్తి మనోవికాసమే అసలైన భూమిక. 

అనాది కాలంలో అనేక మంది తమ జప తపో శక్తులను యజ్ఞ క్రియలలో ధారపోసిన ఫలం .. కాలక్రమేణా వినియోగమవుతూ .. నేటికి దాదాపు శూన్యమైపోయింది. ఇప్పటికైనా మనం మేలుకుని, యజ్ఞక్రియను నిస్వార్ధమైన - స్వచ్ఛమైన అంకిత భావంతో, సర్వతోముఖంగా, నిర్వహించకపోతే ముందు తరాలు చీకట్లోనే మగ్గిపోతాయి. 

Wednesday, 29 April 2026

మంత్రమే మోక్ష కారకం

సృష్టి సమస్తం శక్తిమయం. ఈ సృష్టి ఏర్పడేందుకు అవసరమైన ప్రదేశం (మహత్తు) మొదలుకొని.. గ్రహాలు, పంచ భూతాలు, జీవరాశులు, శిల వృక్షాదుల వరకూ.. అంతా శక్తి రూపమే. ఆ శక్తి పరిమాణంలో ఉన్న తేడాలే  ఆయా పదార్థాల రూప లక్షణాలలో ఉన్న తేడాలకు అసలు కారణం. అయితే  అత్యంత శుద్ధమైన స్థితిలో ఉండే శక్తి .. పదార్ధ రూపమైన సృష్టిగా ఆకారం దాల్చడానికి ముందు జరిగే ప్రక్రియ ఏమిటి? ఆ ప్రక్రియను ప్రభావితం చేసేది ఏది? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించిన వారే ఋషి స్థితికి చేరుకుని బ్రహ్మతత్వాన్ని అనుభవం చేసుకోగలిగారు.

ఈ నేపథ్యంలో ఒక సాధారణ సన్నివేశాన్ని విశ్లేషిద్దాం. ఒక వ్యక్తికి ఫలానా చోటుకి వెళ్లాలి అనిపిస్తుంది. ఇది సూక్ష్మస్థితి. ఎందుకంటే ఆ 'అనిపించడం' ఎవరికీ కనిపించదు. కానీ తర్వాత ఆ వ్యక్తి దుస్తులు వేసుకోవడం, తల దువ్వుకోవడం, చెప్పులు వేసుకోవడం, నడుచుకుంటూ (లేదే వాహనంపై) ఫలానా చోటుకి వెళ్లడం అందరికీ కనిపిస్తుంది. ఇది స్థూలస్థితి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఆ వ్యక్తికి అలా ఎందుకు అనిపించిందో అతనికి గానీ, ఇతరులకి గానీ అణుమాత్రం కూడా తెలియదు. ఇది కారణస్థితి. ఇలా మనుషులకు స్థూల స్థితి తప్ప, సూక్ష్మ - కారణ స్థితులు గ్రహించగల సామర్ధ్యం ఉండదు. ఎవరికి వారు తమకు కనిపించిన దాన్ని (స్థూలాన్ని) బట్టి వాటిని (సూక్ష్మ - కారణాల్ని) ఊహించుకుంటారు. అలాంటి ఊహలకు చోటివ్వకుండా ప్రతి కదలికలోనూ (స్థూలంలో) ఉన్న రహస్యం (సూక్ష్మ - కారణాలు) తెలిసిన జీవుడే ఋషి, బ్రహ్మవేత్త.  

శక్తి నుంచి సృష్టి ఎలా జరుగుతుందో, ఆ పరిణామంలో ఉన్న దశలు ఏమిటో, అవన్నీ జీవరాశుల వికాసానానికి ఎలా దోహదపడతాయో వివరించేవే వేదాలు. ఇవి శబ్ద ప్రధానమైనవి. అత్యంత శుద్ధమైన శక్తి తప్ప మిగిలిన సమస్తానికి స్థూల - సూక్ష్మ - కారణ స్థితులు ఉంటాయి. అలాగే శబ్దానికి కూడా ఆ మూడు స్థితులు ఉంటాయి. స్థూల శబ్దాన్ని అక్షరమని, సూక్ష్మ శబ్దాన్ని గాయత్రీ అని, కారణ శబ్దాన్ని బ్రహ్మమని ఋషులు పిలుచుకున్నారు. అలా కారణ శబ్ద రూపకమైన సృష్టిని, ఏ జీవుడు అవబోధపరుచుకోగలడో అతడే బ్రహ్మవేత్త. ఈ స్థితిని పొందడానికి అత్యంత సులభమైన సాధనం మంత్రం. 

మంత్రం అనేది స్థూల శబ్దం. నిజానికి మనిషి, జంతువు, రాయి యిత్యాదులన్నీ స్థూల శబ్దాలే. మన మనసు కూడా ఒక శబ్దమే. అయితే ఏ శబ్దమైతే స్థూలమైన 'మనసు' శబ్దాన్ని తనలో కలుపుకుని, సమస్త పదార్థాల చేతనకు కారణమైన సూక్ష శబ్దాలను లయం చేసుకుంటూ, శక్తి లక్షణమైన కారణ శబ్దం వైపు తీసుకొని పోగలదో .. అట్టి ప్రత్యేక శక్తి గల శబ్దమే మంత్రము. నింగి, నేల,నీరు, నిప్పు, గాలికి ఎలా మతాలు లేవో .. అలాగే వాటి తన్మాత్రలైన శబ్దం, గంధం, రుచి, రూపం,స్పర్శ లకు కూడా మతాలు లేవు. మనిషిని చక్కదిద్దేది మతం. మానవాళి శ్రేయస్సును తీర్చిదిద్దేది మంత్రం.

దీనిపై ఋషులు వేల వేల సంవత్సరాలు పరిశోధన చేసి .. ఎలాంటి శబ్దం మనిషి మనసుని కారణ శబ్దానికి పరిచయం చేసి, అక్కడ నుంచి ఆ మనసుని శక్తి లక్షణానికి, తత్వానికి దగ్గరగా తీసుకువెళుతుందో తెలుసుకున్నారు. అలాంటి శబ్ద (సంపుటికి) రూపానికి గాయత్రీ మంత్రం అని పేరు పెట్టారు. ఆ మంత్రాన్ని ఎవరైతే మననం చేస్తూ మనసులో రాపిడి పుట్టిస్తారో వారి మనసు కారణ శబ్దం దిశగా ప్రయాణం మొదలుపెడుతుంది. అందుకే  మానవులందరూ గాయత్రీ మంత్రాన్ని జపించాలని, దాని వల్ల కాలంలో వచ్చే మార్పులకు జీవ - పర్యావరణ సమతుల్యత చెక్కుచెదరదని  బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హితవు చెప్పాడు. అందుకే  గాయత్రీ మంత్రాన్ని అందరూ తమ తమ సామర్ధ్యం మేరకు జపించాలి.