Wednesday, 29 April 2026

మంత్రమే మోక్ష కారకం

సృష్టి సమస్తం శక్తిమయం. ఈ సృష్టి ఏర్పడేందుకు అవసరమైన ప్రదేశం (మహత్తు) మొదలుకొని.. గ్రహాలు, పంచ భూతాలు, జీవరాశులు, శిల వృక్షాదుల వరకూ.. అంతా శక్తి రూపమే. ఆ శక్తి పరిమాణంలో ఉన్న తేడాలే  ఆయా పదార్థాల రూప లక్షణాలలో ఉన్న తేడాలకు అసలు కారణం. అయితే  అత్యంత శుద్ధమైన స్థితిలో ఉండే శక్తి .. పదార్ధ రూపమైన సృష్టిగా ఆకారం దాల్చడానికి ముందు జరిగే ప్రక్రియ ఏమిటి? ఆ ప్రక్రియను ప్రభావితం చేసేది ఏది? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించిన వారే ఋషి స్థితికి చేరుకుని బ్రహ్మతత్వాన్ని అనుభవం చేసుకోగలిగారు.

ఈ నేపథ్యంలో ఒక సాధారణ సన్నివేశాన్ని విశ్లేషిద్దాం. ఒక వ్యక్తికి ఫలానా చోటుకి వెళ్లాలి అనిపిస్తుంది. ఇది సూక్ష్మస్థితి. ఎందుకంటే ఆ 'అనిపించడం' ఎవరికీ కనిపించదు. కానీ తర్వాత ఆ వ్యక్తి దుస్తులు వేసుకోవడం, తల దువ్వుకోవడం, చెప్పులు వేసుకోవడం, నడుచుకుంటూ (లేదే వాహనంపై) ఫలానా చోటుకి వెళ్లడం అందరికీ కనిపిస్తుంది. ఇది స్థూలస్థితి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఆ వ్యక్తికి అలా ఎందుకు అనిపించిందో అతనికి గానీ, ఇతరులకి గానీ అణుమాత్రం కూడా తెలియదు. ఇది కారణస్థితి. ఇలా మనుషులకు స్థూల స్థితి తప్ప, సూక్ష్మ - కారణ స్థితులు గ్రహించగల సామర్ధ్యం ఉండదు. ఎవరికి వారు తమకు కనిపించిన దాన్ని (స్థూలాన్ని) బట్టి వాటిని (సూక్ష్మ - కారణాల్ని) ఊహించుకుంటారు. అలాంటి ఊహలకు చోటివ్వకుండా ప్రతి కదలికలోనూ (స్థూలంలో) ఉన్న రహస్యం (సూక్ష్మ - కారణాలు) తెలిసిన జీవుడే ఋషి, బ్రహ్మవేత్త.  

శక్తి నుంచి సృష్టి ఎలా జరుగుతుందో, ఆ పరిణామంలో ఉన్న దశలు ఏమిటో, అవన్నీ జీవరాశుల వికాసానానికి ఎలా దోహదపడతాయో వివరించేవే వేదాలు. ఇవి శబ్ద ప్రధానమైనవి. అత్యంత శుద్ధమైన శక్తి తప్ప మిగిలిన సమస్తానికి స్థూల - సూక్ష్మ - కారణ స్థితులు ఉంటాయి. అలాగే శబ్దానికి కూడా ఆ మూడు స్థితులు ఉంటాయి. స్థూల శబ్దాన్ని అక్షరమని, సూక్ష్మ శబ్దాన్ని గాయత్రీ అని, కారణ శబ్దాన్ని బ్రహ్మమని ఋషులు పిలుచుకున్నారు. అలా కారణ శబ్ద రూపకమైన సృష్టిని, ఏ జీవుడు అవబోధపరుచుకోగలడో అతడే బ్రహ్మవేత్త. ఈ స్థితిని పొందడానికి అత్యంత సులభమైన సాధనం మంత్రం. 

మంత్రం అనేది స్థూల శబ్దం. నిజానికి మనిషి, జంతువు, రాయి యిత్యాదులన్నీ స్థూల శబ్దాలే. మన మనసు కూడా ఒక శబ్దమే. అయితే ఏ శబ్దమైతే స్థూలమైన 'మనసు' శబ్దాన్ని తనలో కలుపుకుని, సమస్త పదార్థాల చేతనకు కారణమైన సూక్ష శబ్దాలను లయం చేసుకుంటూ, శక్తి లక్షణమైన కారణ శబ్దం వైపు తీసుకొని పోగలదో .. అట్టి ప్రత్యేక శక్తి గల శబ్దమే మంత్రము. నింగి, నేల,నీరు, నిప్పు, గాలికి ఎలా మతాలు లేవో .. అలాగే వాటి తన్మాత్రలైన శబ్దం, గంధం, రుచి, రూపం,స్పర్శ లకు కూడా మతాలు లేవు. మనిషిని చక్కదిద్దేది మతం. మానవాళి శ్రేయస్సును తీర్చిదిద్దేది మంత్రం.

దీనిపై ఋషులు వేల వేల సంవత్సరాలు పరిశోధన చేసి .. ఎలాంటి శబ్దం మనిషి మనసుని కారణ శబ్దానికి పరిచయం చేసి, అక్కడ నుంచి ఆ మనసుని శక్తి లక్షణానికి, తత్వానికి దగ్గరగా తీసుకువెళుతుందో తెలుసుకున్నారు. అలాంటి శబ్ద (సంపుటికి) రూపానికి గాయత్రీ మంత్రం అని పేరు పెట్టారు. ఆ మంత్రాన్ని ఎవరైతే మననం చేస్తూ మనసులో రాపిడి పుట్టిస్తారో వారి మనసు కారణ శబ్దం దిశగా ప్రయాణం మొదలుపెడుతుంది. అందుకే  మానవులందరూ గాయత్రీ మంత్రాన్ని జపించాలని, దాని వల్ల కాలంలో వచ్చే మార్పులకు జీవ - పర్యావరణ సమతుల్యత చెక్కుచెదరదని  బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హితవు చెప్పాడు. అందుకే  గాయత్రీ మంత్రాన్ని అందరూ తమ తమ సామర్ధ్యం మేరకు జపించాలి. 

No comments:

Post a Comment