Monday, 27 April 2026

మూడు పొరలు - ముచ్చట్లు

స్థూలం, సూక్ష్మం, కారణం అనే మూడు పొరలు ఉన్నట్టే, మనిషికి దేహం, మనసు, మనసుకు అవతల ఉంటాయి. దేహం బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌ ప్రకారం నడుచు కుంటుంది. దానికి వేరే ఆప్షన్‌ లేదు.  ఆహారం, భయం, నిద్ర, మైథునాలతో విసుగెత్తిన వారు మాత్రమే ‘ఇంకేం లేదా’ అని మనసులోకి తొంగి చూస్తారు.

అయితే వారి దృష్టి .. పదార్ధాలకు, పరిసరాలకు, పరిస్థితులకు మించి ఉండక పోవడంతో గోడకి తగిలిన బంతి వెనక్కొచ్చినట్టు .. బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌ తోనే "తెలివి" గా జీవిస్తుంటారు.  నిత్యమైన శాశ్వతమైన అనుభవాన్ని మిగల్చలేని ఈ దేహాన్ని, మనసుని దాటితే ఏమవుతుంది? ఈ ప్రశ్నే మనిషిని ఋషిగా మార్చింది.

అందరూ క్రమంగా శారీరక, మానసిక జీవితాలతో విసిగి వేసారిపోతారనే సత్యం తెలిసి ఋషి మనల్ని రెండు పనులు చెయ్యమన్నాడు. ఒకటి ఋషి అయ్యే  ప్రయత్నం (తపస్సు) చేయడం, రెండు అలాంటి ప్రయత్నం చేసే వారిని పోషించడం. ఈ రెండు పనులూ ఆచరించే వారికి అప్రమేయమైన (శారీరక, మానసిక సంబంధం లేని) ఆనందం ఆనుభవమవుతుంది.

చేయించే సమస్తం భగవంతుడు అనేది సత్యం. ఆ సత్యం అనుభవంగా తెలియడమే జన్మ అదృష్టం. 

తపస్సు చేసే అవకాశం అందరికీ రాదు కానీ తపస్సుకు అండగా నిలిచే అవకాశం అందరికీ ఉంటుంది. మనసు గ్రహించలేని ఒక చేతకు మనసారా చేయూతనివ్వానిపించడం ఋషుల అనుగ్రహ ఫలమే. దీని వల్ల తెలిసీ తెలియక చేసిన అనేక జన్మ పాపాలు ప్రక్షాళనమవుతాయి. నిర్మోహమైన చేత ఒక్కటే గురుకృపను కటాక్షిస్తుంది.

మనసుకు ఉన్న పీకులాటే మనలోని పర్వతమంత మోహానికి గుర్తు. అందుకే కృష్ణుడు ‘కర్మణ్యేవాధికరస్తే ..’ అన్నాడు. చేతను దైవానికి సంధానం చేసి మనసుకు దూరం చేయడమే (చేత) సేవ. భగవత్సేవలో మనసుకు చిన్న కోరికైనా ఉండచ్చేమో గానీ, తాపసులకు మనసుతో (కోరి) చేయగల పని అంటూ ఏదీ సృష్టిలో లేదు. అందుకే ఋషి ఋణం తీర్చుకోవడమే అత్యంత దుర్లభమైనది. అలాంటి అవకాశాన్ని ‘చేతనైనంత మేర చేయగలిగింది చేస్తా’నని అందిపుచ్చుకోవడానికి జన్మ సుకృతం ఉండాలి.

No comments:

Post a Comment