Wednesday, 29 April 2026

మనసు మిత్రుడా శత్రువా

ప్రతి మనిషీ తన దేహాన్ని ఉద్దేశించి ‘‘నేను’’ అని ప్రకటిస్తూ ఉంటాడు. ఆ దేహం ఇంద్రియాలకు నిలయం. ప్రాణంతో ఉన్న దేహం నుంచి అందిన శక్తితో కదిలే ఇంద్రియాలే .. జడ స్వరూపమైన మనసును చైతన్యం చేస్తాయి. చైతన్యమైన మనసు ఆ (మనిషి చెప్పుకునే) ‘‘నేను’’ను స్వాధీనం చేసుకుని ఇంద్రియాలు అనే గుర్రాల మీద సవారీ చేస్తూ ఉంటుంది.

కానీ ఈ స్వారీని .. ‘నేనే’ చేస్తున్నాను అనుకుని మనిషి మురిసిపోతూ ఉంటాడు. కొన్నేళ్లకి వయోభారంతో దేహంలో ప్రాణశక్తి క్షీణించి ఇంద్రియాలకు ముసలితనం వస్తుంది. ఆ ముసలి (ఇంద్రియాలపై) గుర్రాలపై స్వారీ చేయలేక మనసు చతికిబడుతుంది. దాంతో పాటు మనిషి కూడా చతికిలబడక తప్పదు. ఈ పరిస్థితికి ఏ మనిషీ మినహాయింపు కాదు. ఇది ప్రకృతి నియమం. 

ఇంద్రియాల ఆసరాతో గంతులేసే మనసుకు ఇంద్రియాతీతంగా వికసించే లక్షణం కూడా ఉంది. ఎవరికైతే  ‘నేను  వేరు, మనసు వేరు’ అనే ఎరుక ఉంటుందో వారి మనసు మాత్రమే వికసించే దిశగా ప్రయాణిస్తుంది. ఆ మనసే దృశ్య భౌతికం (ప్రపంచం) కాకుండా అధిభౌతికం (మరో ప్రపంచం) ఉందని గ్రహిస్తుంది. దానినే మానసిక వికాసం అంటారు.

ఇలా మనసును వికసింప జేయగల శక్తిసామర్ధ్యాలు మేధస్సుకు ఉండవు. మేధస్సు .. దృశ్య (ఇంద్రియ) చింతన పరిధిలో ఉంటుంది. ఇది పరిమితం. మనోవికాసం .. తత్వ (ఇంద్రియాతీత) చింతన పరిధిలో ఉంటుంది. ఇది అపరిమితం. మేధావులు శాస్త్రాలను ప్రమాణంగా తీసుకుని తర్కం అనే కోట కట్టుకోగా, తాత్వికులు అనుభవాన్ని ప్రమాణంగా తీసుకుని అనుభవ సారాన్ని అందరికీ పంచారు.  

మేధావుల సిద్ధాంతాలు ఇజాలుగా, తాత్వికుల  అనుభవాలు మతాలుగా ప్రపంచంలో పాతుకు పోయాయి. వాస్తవానికి ఇజాన్ని విశ్వజననీయం చేయడం అసంభవం. అలాగే అనుభవాన్ని అక్షరబద్ధం చేయడం అసంభవం. ఈ సూత్రంలోని మర్మం మనిషి జీవితానికి చుక్కాని అయినప్పుడే నిత్య జీవనం ఆనందమయం అవుతుంది.


No comments:

Post a Comment