Monday, 27 April 2026

ఆదిశంకరులు - అద్వైతం - అవబోధ

ఆది శంకరులు ప్రతిపాదించిన అద్వైతం, ఒలిచిపెట్టిన అరటిపండులా ఉండదు. ఆ విషయం ఆ మహానుభావుడికి కూడా తెలుసు.  అద్వైతం అర్ధం అవ్వాలంటే జీవుడికి పూర్ణ వైరాగ్య స్థితి ఉండాలి. ఈ వైరాగ్యం అనేది అంత సుభంగా ఒంటబట్టదు. అందుకు కారణం  కోరికలే.

కర్మ అధీనంలో ఉన్న మనిషికి కోరికలు సహజం. అపుడు వైరాగ్యం రాదు. అద్వైతం తెలియదు. ఇలా నూటికి తొంభై తొమ్మిది మందికి కోరికలే ఉన్నపుడు .. అద్వైత సిద్ధిపై ఆసక్తి కలవారు ఏమి చెయ్యాలి అని శంకర భగవత్పాదులు కలవర పడ్డారు. కోరిక (కర్మ) ఉన్నవాడు అద్వైతం జోలికి వెళ్లడు, వెళ్లినా నిలబడలేడు. కర్మలో ఉండగా (కోరిక తీరి) అద్వైతం జోలికి వెళ్లడం సంభవించదు. అద్వైతానికి మూలమైన యోగశక్తి .. జీవుడి కర్మలోకి వస్తే తప్ప కోరిక తీరే అవకాశం లేనప్పుడు,  పరిష్కారం ఏమిటా అని శంకరులు చింతించారు. జీవుల శ్రేయస్సు కోసం పరితపించారు.  

కాబట్టే .. ఆయన ద్వారా అఖండమైన ఆత్మశక్తి .. ‘ఆరాధన’ రూపంలో ఆవిష్కృతమైంది. జీవుడి కర్మస్థితిలోకి యోగశక్తిని ప్రవహింప జేయగల  క్రియా విధానమే ఆరాధన.  భగవంతుడనే దృష్టితో ఆరాధనను క్రమబద్ధంగా చేస్తే ..  యోగశక్తి, అంచెలంచలుగా జీవుని కర్మలోకి దిగివస్తుంది. కర్మలోకి చేరిన యోగశక్తి ద్వారా మాత్రమే కోరికలు తీరిన జీవుడు కర్మబంధాలకు దూరమవుతాడు. అలా క్రమంగా వైరాగ్య భావన బలపడి ఆ జీవుడు అద్వైత సాధన వైపు మరలుతాడు. ఇదీ శంకరాచార్యులు ప్రతిపాదించిన అనుభవ సారాంశం. ఈ సారాంశ స్వరూపమైన ఆరాధనలో ఏమున్నదీ అంటే .. బలోపేతమైన బుద్ధిని యోగమార్గం దిశగా నడిపించగల క్రియా విధానమున్నది.  అంటే శంకరులు పేర్కొన్న ఆరాధనా క్రమాన్ని అనుష్టించాలంటే ముందుగా బుద్ధి బలోపేతం అయి ఉండాలి.  

అందుకే ఆయన బుద్ధిని ప్రచోదనం చేయగల  గాయత్రీ మంత్ర జపాన్ని ప్రతి ఒక్కరికి నిర్దేశించారు. అంటే ఆదిశంకరులు అనుభవించిన    అద్వైతాన్ని  సిద్ధింప జేసుకోవాంటే జీవుడు .. ముందుగా గాయత్రీ మంత్ర జపంతో బుద్ధిని బలోపేతం చేసుకుని,  అలా బలపడిన బుద్ధిని యోగమార్గం వైపు నడిపించగల భగవదారాధనా క్రమాన్ని అనుష్టించి, తద్వారా కర్మబంధములై ఉన్న కోరికల నుంచి యోగబంతో విడివడి, వైరాగ్యంతో జీవనం సాగించి అద్వైతాన్ని అనుభవైకవేద్యం చేసుకోవాలి.  

ఇక్కడ రెండు స్పష్టమైన సూత్రాలున్నాయి. ఒకటి. (కర్మ ఉండగా) కోరిక ఉండగా (అద్వైత) సాధన సాగదు. రెండవది. మనసు వైరాగ్య స్థితికి చేరకుండా ఆత్మజ్ఞానం రాదు. కొన్ని సందర్భాల్లో జీవుడు పుట్టుకతోనే అద్భుతమైన బుద్ధిబం కలిగి వైరాగ్యస్థితి పొంది ఆత్మజ్ఞానంతో యోగి కావచ్చు. అలా పుట్టని వారు గాయత్రీ మంత్ర జపంతో బుద్ధి బలం పెంచుకుంటే, ఆ బుద్ధి .. ఆరాధనా బలం వల్ల యోగమార్గం పట్టి,  వైరాగ్యాన్ని మనసుకి పట్టించి ... జీవుడిని, ఆత్మస్థితి వైపు కదిలిస్తుంది. ఇలా కోరిక (కర్మ), గాయత్రీ మంత్ర జపం, బుద్ధి బలం, భగవదారాధన, కోరికపై వైమనస్యం, క్రమేణా వైరాగ్యం, యోగసాధన, ఆత్మజ్ఞానం, అద్వైత స్థితి అన్న అంశాలతో జగద్గురువు ఆదిశంకరులు ఈ జగత్తుకి ఆధ్యాత్మిక భిక్ష పెట్టారు. 

ఎప్పుడైతే జీవులు గాయత్రీ మంత్ర జపానికి దూరమయ్యారో ఆనాటి నుంచే కోరికల పరంపరలో చిక్కుకుపోయారు. కోరికల సాంద్రత నుంచి బయటపడాలంటే గాయత్రీ మంత్ర జపం తప్ప జీవుడికి మరొక మార్గం లేదు. కర్మతో వచ్చిన మనసు తోటి, దాని బలం తోటి ఏది చేసినా .. ఎవరు చేసినా .. అది బుద్ధి బలాన్ని పెంచలేదు. తెలియని బుద్ధి కంటే తెలిసిన మనసు గొప్పదనే భావన బలపడిననాటి నుంచి, ఆ మానసిక భావనలోనే భగవదారాధన చేయడం అలవాటు పడిన నాటి నుంచి,  ఆధ్యాత్మికం మొత్తం ఆత్మజ్ఞానానికి దూరమైంది.  ఇవాళ్టికీ పరిస్థితి మారలేదు.  

No comments:

Post a Comment