Wednesday, 29 April 2026

'నాకు తెలుసు(లే)'

'నాకు తెలుసు(లే)' అని అనని, అనుకోని మనిషి ఉండడు. కానీ మనిషికి ఏమన్నా తెలుసా లేక ఏదైనా తెలుసుకోగలడా అనేది ప్రశ్న. ఎవ్వరికైనా తెలియనిది అంటూ ఏదో ఒకటి ఉంటుంది. నూటికి కనీసం ఓ 60 మంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు కాబట్టి అంత ఇబ్బంది లేదు.

ఇక .. నాకు తెలుసు అన్న విషయం గురించే అసలు ఇబ్బంది. నూటికి 99 మంది అంటున్న ఈ తెలుసు అన్నదాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇంతకీ మనిషికి తెలిసింది ఏంటి, తెలుసుకోగలిగినది ఎంత? తెలివితేటలని పొరలు పొరలుగా విడదీస్తేనే తప్ప అసలు రంగు బయటపడదు.

నిప్పు కాలుతుందని అందరికీ తెలుసు. కానీ జీవితంలో ఒక్కసారైనా అందరికీ కనీసం వేలైనా చుర్రుమని అనే ఉంటుంది. ఏం?  తెలియడం వల్ల 'సంఘటన'ని నియంత్రించడం ఎవరి వల్లా కాదు. ఆట ఎంత తెలిసినా సచిన్‌ సైతం అవుట్‌ అవ్వాల్సిందే. అందుకే 'తెలుసు, తెలివితేటలు' వంటి పదాలు కాలగమనంలో మనిషిని గట్టెక్కించ లేవు.

తనలో కలిగిన భావానికి కారణం తెలియడమే అసాధ్యమైనప్పుడు, కాలంలోని విషయాలకి భాష్యం చెప్పటం అమాయకత్వం. అందుకే మనిషి ముందుగా తెలుసుకోవాల్సింది తన గురించే అని ఆథ్యాత్మికం కరాఖండిగా చెప్పింది. నీ గురించి నీకు తెలిసేంత వరకూ నీకు ఇంకేదీ తెలిసే అవకాశమే లేదు అనేది సూత్రం. ఈ సూత్రంలో ఉన్న మర్మం తెలియాలంటే .. ప్రతి విషయాన్నీ 'ఎందుకు' అని ప్రశ్నించాలి.

తన ఆలోచన, మాట, చేత, కదలిక .. అలా ఎందుకు ఉంది అని ప్రశ్నించుకుంటే, ఎవరి అజ్ఞానం వారికే కనిపిస్తుంది. ఉదయం నుంచీ రాత్రి వరకూ జరిగిన ప్రతి అంశమూ ఎందుకు అలా జరిగిందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ 'నేను' ఎవరో తెలిసిన వారికి సాధ్యం.

మనసుకి ఆపాదించుకునే లక్షణం ఉంది. అందుకే ఎవరికి వారు నేను, నా అభిప్రాయం అంటూ మాట్లాడుతుంటారు. కానీ మనిషికి సంఘటనలను నడిపించే సామర్ధ్యం, స్వాతంత్య్రం ఉండనే ఉండదు. ఆ సంఘటనలలో తను అప్రమేయంగా కదిలిపోతున్నా .. తన ప్రమేయాన్ని ఆపాదించుకుని కబుర్లు చెప్పడం మనసు చేసే కోతిపని.

కాబట్టి మనసు ఆ పని చేయకుండా నిఘా ఉంచాలి. నిఘా ఉందని తెలుస్తే దొంగ కూడా నిజాయితీగా ఉంటాడు. కానీ మనసుపై నిరంతరం నిఘా ఉంచడం సాధ్యపడదు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా దొంగతనం చేసినవాడికి శిక్ష ఉంది కానీ దొంగతనాన్ని ఆలోచించిన వాడికి శిక్ష లేదు. నేరపూరితమైన ఆలోచనకి శిక్ష వేయగల సమర్ధత ఈ ప్రపంచానికి లేదు. దొంగతనం అంటే వ్యక్తి చర్య అని మాత్రమే సంఘం గుర్తించగలదు. చర్యకి కారణమైన ఆలోచన రాకుండా చేయడం, అలాంటి ఆలోచనకు మూలమైనదాని స్వభావాన్ని మార్చడం ఏ మనిషి వల్లా, ఏ వ్యవస్థ వల్లా సాధ్యపడదు.

కానీ మనిషి .. 'నేను' అనుకుంటున్న మనసును పుఠం పెడితే .. అసలు చర్య యొక్క రూపమే మారిపోతుంది. అలా మనసు స్వభావాన్ని మార్చేదే మంత్రం. అనంతమైన 'నేను' మనిషికి అనుభవమవాలంటే .. మనసు మౌనంలోకి వెళ్లాల్సిందే. మౌనం అంటే మరో ధ్యాస లేని పనిలో నిమగ్నమవడం. మనసుని మౌనంలోకి తీసుకెళ్లగలిగినది జపం ఒక్కటే.

అందుకనే ముందుగా 'నేనేవరు' అనే ప్రశ్నని పదేపదే సంధిస్తూ ఉండాలి. అపుడు నీరు పల్లమెరుగు అన్నట్టు మనసు మౌనంలో విరాగమవుతుంది. క్రమేపీ    ఆపాదించుకునే లక్షణానికి దూరమవుతుంది. తద్వారా మనిషి తాను దేనికీ కర్త కానని గ్రహించగలుగుతాడు. అలా ఈ భౌతిక జీవనంలో తను చేసేది, పొందేది ఏదీ లేదని ఎరుకగలిగిన స్థితిలో ఉండగా జీవుడు అనంతంలోకి విస్తరించే    ప్రక్రియ .. శ్రీకారం చుట్టుకుంటుంది. అంతటా వ్యాప్తి చెందిన జీవుడే అసలైన .. పూర్ణమైన ''నేను''.

No comments:

Post a Comment