శక్తిని క్షీణింపజేసే పదార్ధాల నుంచి దూరమై,శక్తిని వృద్ధి చేసే పదార్ధాలకు చేరువై ..జీవనం సాగించడమే మన విధి. ఈ విధి విధానాలను వివరించేదే ఋషిమార్గం.
మనిషి అవసరాలు తీర్చేది ప్రకృతి.ఆ ఇద్దరికీ ఉన్న బంధాన్నే కర్మ అంటారు.ఆ కర్మ బంధం మేరకు మనిషిఅవసరాలను తీర్చడమే ప్రకృతి పని.కర్మలో లేని విషయాన్ని మనిషి ఎంత కోరుకున్నా దానిని ప్రకృతి సమకూర్చదు.
తీరని కోరికలతో మనిషి వికృతమవడం, వికృత జీవుల విన్యాసాలకు భూమినిస్సారమైపోవడం కాల ప్రభావం. ఆధ్యాత్మిక శక్తితో మనిషి జీవనశైలిని క్రమబద్ధంచేయడం, ఆత్మశక్తితో ప్రకృతిలో సారాన్ని పెంచడంవంటి ఉత్తమ లక్ష్యాల సాధనకు యజ్ఞక్రియల నిర్వహణే సర్వోత్తమ మార్గం.
భగవంతుడు ఆ ఏనుగు మీది అంబారీలోనే ఉండొచ్చుగాక ..కానీ ఆ అంబారీని మోసే ఏనుగుకి ఓ అరటి పండిచ్చినా ..సాక్షాత్తూ ఆ భగవంతుడినే శిరసా ధరించినట్టు. !!!
భగవంతుని సంకీర్తన వల్ల మన మన మనసుల్లోనే కాదు, మన చుట్టూ ఉన్నవాతావరణంలో కూడా ఆహ్లాదం నిండుతుంది. మన ఇంట్లో, నిత్య జీవనంలో హాయిగా ఆ పరమాత్ముడిని అనవరతమూ సేవించుకోవడమే సద్భక్తితో కూడిన "సంకీర్తన".
మనిషికి ఆనందం .. అరిషడ్వర్గాలు అదుపులో ఉన్నపుడే. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచేది సత్వగుణం ఒక్కటే. సత్వగుణాన్ని వృద్ధి చేసేది ఆరాధనా భావం మాత్రమే. ఆరాధనా భావాన్ని పాదుగొలిపి, పోషించి, పరిపుష్టం చేసేది .. భగవంతుని సేవించే 'మనసు'.
గుణాలు మనిషిలోని అరిషడ్వర్గాల వేగాన్ని పెంచుతాయి. అరిషడ్వర్గాల కదలిక జీవుడి కర్మకి సంబంధించినది. కర్మ వల్లనే జన్మల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది.
"మహిమ" అనే దాన్ని వేదాంతం ఒప్పుకోదు. స్థిరత్వం ఉన్న జీవుడికి "గోచరించనిది" అనేది ఉండదు కాబట్టి .. గమనించలేని ఇతరులు పేర్కొనే 'మహిమ' .. కేవలం వేగం అంటుంది. "యాదృచ్ఛికం" అనే దాన్ని కూడా వేదాంతం ఒప్పుకోదు. కాలం విస్తీర్ణం తెలిసిన జీవుడికి "సంఘటన"కు కారణం తెలిసి తీరుతుంది కాబట్టి .. కారణం తెలియని మేధస్సు చెప్పే 'యాదృచ్ఛికం' .. కేవలం కూర్పు అంటుంది.
మంత్రాక్షరం లోని శబ్దాన్ని మథించడాన్ని 'జపం' అంటారు. జప శక్తిలోని కొంత భాగాన్ని జీవ శ్రేయస్సు కోసం అగ్నికి ఆహుతినివ్వడమే మహాయజ్ఞం. ‘దేవుడికి ప్రేమపూర్వకమైన సేవ’ చేసుకోవడం తప్ప మనిషికి వేరే పనంటూ లేదు. ఇది నిష్కామ కర్మ మార్గం. ఏ పనికైనా ‘భగవంతుడు మూలం’ అని త్రికరణశుద్ధిగా నమ్మితే ఆనందం చేరువవుతుంది. ఇది భక్తి మార్గం. ఏ పనైనా ‘భగవంతుడే’ అని త్రికరణశుద్ధిగా నమ్మితే జ్ఞానం ఆవిష్కార మవుతుంది. ఇది జ్ఞాన మార్గం.
సమస్త జీవరాశుల్లో ' బుద్ధిమంతుడు' అవగల సమర్ధత మనిషికి మాత్రమే ఉంది. అంతరంగాన్ని అణకువతో అర్పించడమే భక్తి. మనిషి మనిషిలా బతకాలన్నా, మహర్షిలా ఎదగాలన్నా .. కాలం కలిసి రావాల్సిందే. అందుకనే ఋషులు మన కోసం '' జీవన విధానం '' రూపొందించారు. అలా జీవించే వారిని కాలం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ధర్మజీవనం కాలాన్ని అమృతం చేస్తుంది. సైద్ధాంతిక జీవనం మనిషిని సంకుచితం చేస్తుంది.
No comments:
Post a Comment